సిద్దిపేట : మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవానికి గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియం వేదికైంది.
పట్టణంలోని తల్లిపాల సొసైటీ, గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ, రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్, లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ మేధా, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, భవాని పాలి క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంత్రి హరీశ్ రావు, డాక్టర్ వాసవచారి సమక్షంలో 500 మంది తల్లులతో పాటు ప్రజలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించి ‘బుక్ ఆఫ్ ఇండియా’లో రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పాలు ఇవ్వడం వల్ల బిడ్డకు, తల్లికి ఇద్దరికి ఉపయోగం ఉంటుందన్నారు. రోగనిరోధక శక్తి పెంచి బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతుందని పేర్కొన్నారు.
డబ్బా పాలు వద్దు.. తల్లి పాలు ముద్దు మన నినాదం కావాలని ఆయన సూచించారు. ఆరోగ్య సమాజాన్ని నిర్మించడంలో ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీలది కీలక పాత్ర అని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), యునిసెఫ్ సంయుక్తంగా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తాయి.
సమాజంలో..తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ‘Step Up For Breastfeeding: Educate and Support’ అనే నినాదంతో ఈ వారం పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
తల్లులు పాలు పట్టలేని నవజాత శిశువులకు, తల్లులు మరణించిన శిశువులకు, అనారోగ్యంతో ఉన్న లేదా తగినంత పాలు అందని శిశువులకు.. లేదా తల్లి పాలను తీసుకోలేని శిశువులకు పాలు అందించాలని మదర్ మిల్క్ బ్యాంకులను.. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రారంభించాం.
హైదరాబాద్ నీలోఫర్ పిల్లల దవాఖానలో మొట్ట మొదటగా ఏర్పాటు చేశాం. ఇది విజయవంతం కావడంతో వరంగల్, ఖమ్మంలోనూ మదర్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు. తల్లి పాల వారోత్సవాల సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు.