యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఈ నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో కీమోథెరపీ సేవలను తీసుకొస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. దేశంలోనే తెలంగాణ మెడికల్ హబ్గా నిలిచిందని పేర్కొన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో 100 పడకల దవాఖాన పనులకు విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. అనంతరం లక్కారంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ ఎన్ని ట్రిక్స్ చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తంచేశారు. ఆ పార్టీ పాలిత రాష్ర్టాలది గన్ కల్చర్ అయితే.. మనది అగ్రికల్చర్ అని, పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో కూడా రాజకీయం చేసేది కాషాయ పార్టీ అని ధ్వజమెత్తారు. పొద్దున వాళ్లే లీక్ చేశారు.. మధ్యాహ్నం ధర్నా చేశారు.. సాయంత్రం లీక్ కాలేదంటారు.. మరి ధర్నా ఎందుకు చేశారు? అని నిలదీశారు. మావి పథకాలు, పనులు అయితే, బీజేపీవి పన్నాగాలు, కుట్రలు అని దుయ్యబట్టారు.
ఎయిమ్స్లో ఇంకా అతీగతి లేదు
ఎయిమ్స్కు 200 ఎకరాల భూమి, రూ.100 కోట్ల విలువైన భవనాలు ఇస్తే.. నాలుగేండ్ల తర్వాత వచ్చిన మోదీ భూమి పూజ చేశారని మంత్రి హరీశ్రావు దుయ్యబట్టారు. ఎయిమ్స్ పనులు నత్తకే నడక నేర్పుతున్నాయని ఎద్దేవాచేశారు. ఇప్పటికీ అతీగతి లేదని, ఓపీ సేవలు మినహా ఇన్పేషెంట్ సేవలు లేవని మండిపడ్డారు. ఎయిమ్స్పై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎయిమ్స్ తర్వాత ప్రారంభమైన నల్లగొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలు పూర్తయ్యి సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నాయని గుర్తుచేశారు.
నాటి, నేటి తేడా సుస్పష్టం
గత ప్రభుత్వాలు వైద్యాన్ని, వైద్య విద్యను పట్టించుకోలేదని హరీశ్రావు చెప్పారు. పెరిగిన జనాభాకు, వ్యాధులకు అనుగుణంగా వైద్య సేవలు పెంచలేదని, కొత్తగా ఒక్క దవాఖాన కూడా కట్టలేదని విమర్శించారు. ఉమ్మడి పాలనలో సరైన వైద్యం అందక ప్రజలు అనుభవించిన నరకయాతనను కండ్లారా చూసిన సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రారంభించాలని నిర్ణయించారని చెప్పారు. రాష్ట్రంలో నిరుడు 8 మెడికల్ కాలేజీలు, ఈసారి మరో 8 తీసుకొచ్చినట్టు తెలిపారు. 2014కు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్లో 20 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడు 46కి చేరాయని గుర్తుచేశారు. సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రాంతంలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా లేదని, నాడు రాష్ట్రం మొత్తం 3 డయాలసిస్ కేంద్రాలు ఉంటే.. స్వరాష్ట్రంలో 104 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గతంలో ప్రభుత్వ దవాఖానల్లో 30శాతం డెలివరీలైతే ఇప్పుడు 63శాతానికి పెంచామని వివరించారు.
మన పథకాలతో బీజేపీకి తిరుగుబాటు: మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమం యావత్తు భారతావనికి పాకిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకాలకు డిమాండ్ పెరిగిందని, ఆయా రాష్ర్టాల ప్రజలు తిరుగుబాటుకు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. హస్తిన పీఠం కదులుతుందన్న బెంగ కాషాయ పార్టీకి పట్టుకున్నదని, సీఎం కేసీఆర్ అంటేనే ఢిల్లీ బాస్కు వణుకు పుడుతుందని ఎద్దేవాచేశారు. ఉచిత విద్యుత్తు మాకెందుకు ఇవ్వడం లేదన్న చర్చ దేశవ్యాప్తంగా ప్రారంభమైందని చెప్పారు. ఇంటింటికీ మంచినీరు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు మాకెందుకు లేవనే వాదన మొదలైందని గుర్తుచేశారు. అందుకే ఇక్కడ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం మోకాలడ్డుతున్నదని మండిపడ్డారు. ‘చౌటుప్పల్లో చాలా మంది మిత్రులకు గుర్తుండే ఉంటుంది.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే వేదికపై అహంకారంతో మన మైక్ గుంజుకున్నారు.. ఇయ్యాల ఆగమైపోయి.. ఎక్కడా మైక్ లేకుండా పోయాడు. మనం ఆ రోజు రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమంలో శాసనసభ్యుడు కదా అని ఆహ్వానిస్తే.. ఓ ఎమ్మెల్యే అని మరిచిపోయి.. రాష్ట్ర మంత్రి అని సోయిలేకుండా మైక్ లాక్కొని పోయిండు. ఇప్పుడు ఆయనకు అసెంబ్లీలోగానీ, మరెక్కడాగానీ మైకే లేకుండా చేసుకున్నాడు.’ అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి జగదీశ్రెడ్డి చురకలంటించారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భట్టీ.. మహిళలు మావైపే
మహిళలు బీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలని, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం ఎందుకు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారని, ఆయన నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హరీశ్రావు సూచించారు. 10.50 లక్షల మందికి కల్యాణలక్ష్మి, 13 లక్షల మంది బాలింతలకు కేసీఆర్ కిట్, నీళ్లు మోసే భారం లేకుండా ఇంటింటికీ నల్లాలు, వడ్డీలేని రుణాలు, ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు ఇచ్చామని వివరించారు. అందుకే మహిళలు బీఆర్ఎస్ వైపే ఉంటారని స్పష్టంచేశారు. తెలంగాణలో ఉన్నన్ని పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటి పథకాలు ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాలు తెలంగాణతో పోటీ పడగలవా? అని ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొననంటే సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొంటున్నారని చెప్పారు.