Minister Harish Rao | సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు.. మెదక్ నియోజకవర్గానికి గంగిరెద్దులు వస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పందించారు. ఓట్ల కోసం డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేటోడు కావాలా? ఆపదలో మనకు తోడుగా ఉండేవారు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మెదక్ నియోజకవర్గం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రామాయంపేట ఆర్డీవో కార్యాలయం, డిగ్రీ కళాశాలలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రామాయంపేట డివిజన్ కావాలని గతంలో 500 రోజులు నిరాహార దీక్షలు చేశారు.
ఈ రోజు రెవెన్యూ డివిజన్ అయితే మీకు ఎంత సంతోషంగా ఉందో.. నాకు అంతే సంతోషం. రామాయంపేట నియోజకవర్గం కేంద్రంగా ఉండేది. అది పోగొట్టింది కాంగ్రెస్ పార్టీ. రామాయంపేటలో డిగ్రీ కళాశాల లేక ఎంతోమంది విద్యార్థులు చదువు ఆపేసిన పరిస్థితి ఉండేది. ఈ రోజు డిగ్రీ కాలేజ్ ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇక నుంచి డిగ్రీ చదవాలంటే మెదక్, కామారెడ్డి వెళ్లాల్సిన అవసరం లేదు. మెదక్ నియోజకవర్గం మీద కన్నేసిన కొంతమంది.. నాకు పైసలు ఉన్నయ్.. మాకు పెద్ద కార్లు ఉన్నాయని చెప్పి పైసల సంచులు వేసుకొని మెదక్ మీదపడుతున్నారు.
కరోనా కష్టకాలంలో ఏమైపోయారు. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు మెదక్ నియోజకవర్గానికి గంగిరెద్దులు వస్తున్నాయి. ఓట్ల కోసం డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేటోడు కావాలా? ఆపదలో మనకు తోడుగా ఉన్నవాళ్లు కావాలా? ఓట్లు ఐపోయినాక ఎవరు కనిపీయరు. ఇది తెల్వని కథనా? మెదక్లో పద్మాదేవేందర్ రెడ్డిని గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దాం. ఇవాళ సంక్షేమ పథకం అందని ఊరు ఎక్కడైనా ఉందా? గతంలో వార్తాపత్రికల్లో రాత్రులు కరెంటు కోసం వేచి చూస్తూ పొలాల్లో పడుకునే రైతుల ఫొటోలు, కరెంట్ షాక్తో చనిపోయిన రైతుల ఫొటోలు అనేకం వచ్చేవి.
కాంగ్రెస్ పాలన అంటే కాలిపోయిన మోటర్లు, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు. కాంగ్రెస్ ఎజెండా దొంగ రాత్రికి చాలీచాలని కరెంటు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపైన చర్చ చేస్తా అంటున్నాడు. సోనియాగాంధీని బలిదేవత అని, కాంగ్రెస్ను అవినీతి పార్టీ అని తిట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ అభివృద్ధి గురించి మాట్లాడుతడా? టీడీపీ నుంచి కాంగ్రెస్ పాలనపై పోరాటం చేసిన రేవంత్ రెడ్డి. ఆనాడు మాట్లాడిన మాట నిజమా? ఈనాడు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్న మాట నిజమా? రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టి ఓట్ల కోసం దిగజారే ఊసరవెల్లి.
కేసీఆర్ నమ్మకం అయితే.. కాంగ్రెస్ నయవంచన. తెలంగాణ కోసం కొట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో నినాదంతో తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్. సద్ది తిన్న రేవు తలవాలి. పైసల సంచులకు లొంగద్దు. ధన బలం కాదు.. ప్రజాబలం గెలవాలి ప్రజలకు పనిచేసే నాయకులు గెలవాలి. మెదక్ ప్రజల కష్టంలో తోడుగా ఉన్న నాయకురాలు పద్మా దేవేందర్రెడ్డి. పద్మక్క గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు. కోరికలు నెరవేర్చి మీరు అడిగిన రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల ఇచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం’ అన్నారు.