Minister Harish Rao | బీజేపీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటోందని, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని అంటున్నారని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు చేయాలంటున్నారని, ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హరీశ్రావు ప్రారంభోత్సవం, భూమిపూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంచి పనులు చేశారన్నారు. ఇబ్రహీంపట్నంపై తనకు ప్రత్యేక ప్రేమ ఉందని, అందుకే అభివృద్ధి చేశారన్నారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.
తల్లులు బలంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్స్ తీసుకువచ్చాం. నాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు 30శాతం అయితే.. నేడు 72.8 శాతం జరుగుతున్నాయి. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి న్యూట్రిషన్ కిట్స్, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్స్ ఇస్తున్నామన్నారు. మహిళల సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో 200 క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రతి మంగళవారం మహిళల కోసమే పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తున్నారని చెప్పారు. తల్లికి పాలు, కోడిగుడ్డుతో భోజనం పెట్టే ఆరోగ్య లక్ష్మి, ఉచితంగా గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లే అమ్మ ఒడి వాహనాలు ప్రారంభించినట్లు చెప్పారు. మహిళలకు తాగునీటి కష్టాలు లేకుండా చేశారన్నారు. నాడు నీళ్ల కోసం కొట్లాట, కనీళ్ల తండాట్లలేనన్నారు. అలాగే వడ్డీ లేని రుణాలు, అభయహస్తం, బ్యాంకు లింకేజీ పెంచినట్లు చెప్పారు.
వీఏవోలను నాటి ప్రభుత్వాలు గుర్తించలేదన్నారు. రెన్యువల్ ఆటోమేటిక్ చేయాలని, ఇన్సూరెన్స్ చేయాలని, వేతనం పెంచాలనే కోరికలను వారంలో పరిష్కరిస్తామన్నారు. వీరితో పాటు ఆర్పీల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించాలని ఆదేశించారని, వారంలో ఉత్తర్వులు ఇస్తామన్నారు.
ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష సీఎం కేసీఆర్ ఇస్తున్నారని, ఆ చెక్కులను తల్లికి ఇవ్వాలని సీఎం ఆదేశించారని హరీశ్రావు తెలిపారు. గృహలక్ష్మి ద్వారా ఇచ్చే డబ్బులు ఇంటి యజమానురాలిపైనే ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఏ కార్యక్రమం చేసిన సీఎం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహిళలకు రూపాయి ఇస్తే ఇంటికి సద్వినియోగం చేస్తారని సీఎంకు నమ్మకం ఉందన్నారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్ను ప్రస్తుతం రూ.2వేలకు పెంచారని, కల్యాణలక్ష్మి పథకంలో రూ.75వేల నుంచి రూ.లక్షకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించారన్నారు. కొందరు ఎన్నికల రాగానే అన్ని ఇస్తామంటున్నారని, ఓడ దాటే దాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టు ప్రతిపక్షాలు చేస్తాయన్నారు.
కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచారని, అక్కడ రైతులకు 8 గంటల కరెంటు రావడం లేదని.. బెంగళూరులో నాలుగు గంటలే ఇస్తున్నారన్నారు. పరిశ్రమలకు కరెంటు కోత ఉందని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంట్ పరిస్థితి అలా ఉంటే.. ఇక్కడి కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల కరెంటు చాలు అంటున్నాడని, మూడు గంటలు ఇస్తే.. మూడు ఎకరాలు పారుతాయని రేవంత్రెడ్డి అంటున్నాడని, బీజేపీ వాళ్లు బావులకాడ మీటర్లకు మోటార్లు పెట్టాలంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడు పంటలు సాగు చేయాలంటున్నారన్నారు. ఎవరు కావాలో ప్రజలే ఆలోచించుకోవాలని, రైతుల పాలిట నల్ల చట్టాలు తెచ్చి బీజేపీ పాపంగా మారితే.. మూడు గంటల కాంగ్రెస్ వాళ్లు శాపంగా మారన్నారు. దీపంలాంటి కేసీఆర్ ఉండగా.. పాపంలాంటి బీజేపీ.. శాపంలాంటి కాంగ్రెస్ ఎందుకు? అంటూ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.