హైదరాబాద్: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు. ఆరోగ్య రంగంలో దేశానికే తెలంగాణ (Telangana) ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కరోనా (Corona) కంటే పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుందని తెలిపారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466 వాహనాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, కాని ప్రస్తుతం 75 వేల మందికి ఒక 108 వాహనం అందుబాటులో ఉందని చెప్పారు. అమ్మఒడి వాహనాలకు నిధులు కావాలని కోరగానే ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని వెల్లడించారు.
జననం నుంచి మరణం వరకు వైద్య, ఆరోగ్యశాఖ సేవలు అందిస్తున్నదని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఐదంచెల వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. తమ మంత్రిత్వ శాఖను నీతి ఆయోగ్ సైతం అభినందించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలుచేస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రం రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ శాఖ 70 శాతానికి పెరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రైవేటు నర్సింగ్ హోంలు మూతపడ్డాయన్నారు. సర్కారు వైద్యంపట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. అమ్మఒడి వాహనాల ద్వారా ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. ఆశావర్కర్ల సెల్ఫోన్ బిల్లులను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ అన్నారు. వారికి స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిందని చెప్పారు. అంబులెన్సులను డైనమిక్ పొజిషన్ చేయాలని అనుకుంటున్నామని వెల్లడించారు. 108 ఉద్యోగులకు నాలుగు స్లాబులుగా వేతనాలు పెంచనున్నామని చెప్పారు.