సిద్దిపేట: వైద్య వ్యవస్థలో తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవం సృష్టించిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా వైద్యులు అవుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో నిర్మించిన వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో ఉన్న సేవలు సిద్దిపేటలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు. గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు సిద్దిపేటలోనే చేసుకోవచ్చని చెప్పారు. రూ.15 కోట్లతో క్యాన్సర్ బ్లాక్కు శంకుస్థాపన చేశామన్నారు.
దవాఖానలో 15 ఆపరేషన్ థియేటర్లు న్నాయని చెప్పారు. నాలుగో ఫ్లోర్లో 100 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 30 ఎమర్జెన్సీ బెడ్స్ ఉన్నాయన్నారు. ఇకపై వైద్య సేవలకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేటలో డయాలసిస్ బెడ్లు 40 పెంచుతున్నామని వెల్లడించారు. రూ.23 కోట్లతో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్నిరకాల వ్యాధులకు సిద్దిపేటలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్ అని పిలిచేలా జీవో ఇచ్చామని వెల్లడించారు.