ఇబ్రహీంపట్నం: కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కాంగ్రెస్ అంటే నాటకమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీ రైతులపై పగపబట్టిందని విమర్శించారు. రైతుబంధు (Rythu Bandhu) ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, ముఠాలు దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటుచేసిన ఇబ్రహింపట్నం బీఆర్ఎస్ (BRS) నియోజకవర్గ స్థాయి బూత్కమిటీ నాయకుల సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గెలువలేని అభ్యర్థులు కూడా నేనే సీఎం అంటున్నారని ఎద్దేవాచేశారు. ఆ పార్టీ నాయకులకు పదవుల మీద యాస తప్ప పనిమీద లేదని విమర్శించారు.
చావునోట్లో తలపెట్టి కేసీఆర్ (CM KCR) తెలంగాణ సాధించారని మంత్రి చెప్పారు. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని నమ్మకం వ్యక్తంచేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా కిషన్ రెడ్డి పారిపోయారని గుర్తుచేశారు. ఇలాంటి నాయకులా కేసీఆర్కు పోటీ అని విమర్శించారు. కేసీఆర్కు పనితనం తప్పా.. పగతనం లేదని స్పష్టం చేశారు.
రైతుబంధును సృష్టించిందే సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుల దగ్గర పన్నులు వసూలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రైతుకే పెట్టుబడి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. రైతుబంధు ఇచ్చి వ్యవసాయాన్ని పండుగలా చేశామని తెలిపారు. పంటపెట్టుబడి సాయం కింద రూ.72 వేల కోట్లు ఇచ్చామన్నారు. కర్ణాటకలో రైతులకు 3 గంటలు కూడా కరెంటు రావడం లేదని చెప్పారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. అందువల్ల మహిళలంతా ముఖ్యమంత్రి వైపే ఉన్నారని స్పష్టం చేశారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తూ తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తదని మంత్రి అన్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, సౌభాగ్యలక్ష్మి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా అందిస్తామన్నారు. కేసీఆర్ బీమాతో రాష్ట్రంలో ప్రతి ఇంటికి ధీమా అన్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులతకూ రూ.5 లక్షల బీమా కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల కుటుంబాలకు రైతు బీమా వస్తున్నదని చెప్పారు.
పార్టీ బూత్ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. మంచికంటే చెడుకు వ్యాప్తి ఎక్కువని చెప్పారు. సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం జరుగుతున్నదని విమర్శించారు. తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలోనే తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పథకాలను కాపీ కొడుతున్నదని విమర్శించారు. వచ్చే ఐదేండ్లలో ఇబ్రహీంపట్నంకు సాగునీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు.
Live: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీ @BRSHarish #KCROnceAgain #VoteForCar https://t.co/dBoKUTQ1E5
— BRS Party (@BRSparty) October 27, 2023