హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కానీ తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేండ్లలోనే 29 మెడికల్ కాలేజీలు కట్టామన్నారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. తెలంగాణ (Telangana) ఏర్పడ్డాక వైద్యారోగ్య శాఖ ఎంతో పురోగతి సాధించిందని మంత్రి చెప్పారు. 9 ఏండ్ల సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో 80 ఐసీయూ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. పేదల వైద్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స్పష్టం చేశారు.
అతితక్కువ తల్లి మరణాల నమోదులో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐ స్క్రీనింగ్ ఒక్క తెలంగాణలోనే ఉందని చెప్పారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేశామని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కింద ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని సినీ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్ కొనియాడారని వెల్లడించారు. న్యూయార్క్లో ఉన్నానా.. హైదరాబాద్లో ఉన్నానా అని ఆశ్చర్యపోయారని చెప్పారు. అభివృద్ధి పక్కరాష్ట్రం వారికి కనుబడుతున్నదికానీ ప్రతిపక్షాలకు కనబడటం లేదని విమర్శించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని చెప్పారు. ప్రస్తుతం ఆ సంఖ్య 102కు పెంచుకున్నామని వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద డయాలసిస్ కేంద్రం నిమ్స్లో ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఒకేసారి 150 మంది డయాలసిస్ చికిత్స పొందుతున్నారని చెప్పారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను ఉచితంగా చేస్తున్నామని, వారికి జీవిత కాలం ఉచితంగా మందులు ఇస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. 16 లక్షల 17 వేల మంది ఆరోగ్య శ్రీ సేవలు వినియోగించుకున్నారని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద రూ.7 కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ,756 కోట్లు ఖర్చు చేశారని, 9 ఏండ్ల సీఎం కేసీఆర్ పాలనలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.3 వేల కోట్లు ఖర్చుచేశామన్నారు. ఒక్క డయాలసిస్ సేవల మీదనే ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు.
ప్రతి సంవత్సరం విద్య మీద పెడుతున్న ఖర్చు పెరుగుతూ వస్తున్నదని చెప్పారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,611 కోట్లు కేటాయించామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 682 గురుకులాలు ఉండేవాని, ఇప్పుడు 1517 గురుకులాల్లో 7,44,759 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు 1,94,370 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 7,44,759కి పెరిగిందన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెడుతున్నామని చెప్పారు. గతంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు ఏడాదికి రూ.973 కోట్లు ఖర్చుపెట్టేవారని, ఇప్పుడు రూ.4,049 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1346 జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు ఉన్నాయని చెప్పారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క శాసన సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.