హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్లో ఐపీ (ఇన్పేషెంట్), ఓపీ (అవుట్ పేషెంట్) లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. థియేటర్లు లేక ఆపరేషన్లు చేయడం లేదని, ఫోర్త్ ఇయిర్ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసే వసతులు లేకపోవడంతో భువనగిరి దవాఖానలో ప్రాక్టికల్స్కు అనుమతి ఇచ్చామని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైద్యవసతుల కల్పనలో కేంద్ర,రాష్ట్ర వాటా, డబుల్ ఇంజిన్ సర్కారు, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో మెడికల్ కాలేజీల పరిస్థితి, డెంటల్ కాలేజీల ఏర్పాటు, పారామెడికల్ కోర్సులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, డాక్టర్ సంజయ్కుమార్, పద్మాదేవేందర్రెడ్డి, కౌసర్ మోహినుద్దీన్, దానం నాగేందర్ వేసిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యవిద్యలో గుణాత్మక, విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో గతంలో 850 సీట్లు ఉంటే, 2,790 సీట్లను పెంచామని చెప్పారు. వెనుకబడిన మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తారని ఎవరైనా ఊహించారా ? అని ప్రశ్నించారు.
కేంద్రం దేశవ్యాప్తంగా 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరుచేస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని, అప్పటి మంత్రులు ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు. కేంద్రం ఇవ్వకపోయినా ప్రతి జిల్లాలో నర్సింగ్, పారామెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నామని, అన్ని కోర్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. 1,457 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఒక్క ఖాళీ లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరంలోనే మెదక్లో మెడికల్ కాలేజీ, హైదరాబాద్ ఫిల్మ్నగర్లో పీహెచ్సీకి కొత్త భవనాన్ని మంజూరు చేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,30,463 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఆయిల్పాం సాగులో ప్రగతి సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, గువ్వల బాలరాజు, బాల్క సుమన్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పాం సాగుచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నదన్నారు. రైతులు దరఖాస్తు చేసుకొన్న నెలలోపే మెటీరియల్, డ్రిప్, గుంతలు తీయడం వంటి వాటిని పూర్తిచేస్తున్నామని చెప్పారు. 60-70లక్షల ఎకరాల్లో సాగు చేస్తేనే దేశవ్యాప్తంగా నూనె అవసరాలు తీరుతాయని, దేశంలో రోజుకు 26 లక్షల మెట్రిక్ టన్నులు నూనె అవసరమవుతుండగా, మనవద్ద 15 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నదని పేర్కొన్నారు. 11 లక్షల మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకుంటున్నామని, దీన్ని అధిగమించేందుకు ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నట్టు మంత్రి చెప్పారు.
ప్రశ్నోత్తరాల సమయం మించిపోవడం, డిమాండ్లపై చర్చను చేపట్టాల్సి ఉండటంతో కేసీఆర్ పోషకాహార కిట్, పోలీసుశాఖలో పోస్టుల భర్తీ, రైతు బీమా, ఆరోగ్యలక్ష్మి పథకం, జిల్లా కేంద్రాల్లో షీటీమ్లు, డిగ్రీ కాలేజీ ఏర్పాటుపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చినట్టుగానే భావించాలని స్పీకర్ ప్రకటించారు.