నిజామాబాద్: అగ్నిపథ్ వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్మీ ఉద్యోగాలకు కేంద్ర మంగళం పాడుతున్నదని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ఆర్మీని ప్రైవేట్పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్ని రాజుకుందని చెప్పారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడుల వెనక ఇక్కడ టీఆర్ఎస్ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. యువకుల బాధ కేంద్రానికి అర్థంకావడం లేదని విమర్శించారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ మాటలు తీయగా, చేతలు చేదుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్ననది చెప్పారు.