Harish Rao | సిద్దిపేట : హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి దయతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టి తీరుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విశ్వాసం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ శుభదినం. ఎందుకంటే మేనిఫెస్టో ప్రకటించి.. నేరుగా సీఎం కేసీఆర్ హుస్నాబాద్కే వచ్చారని హరీశ్రావు తెలిపారు. 2018 ఎన్నికల్లో ఇక్కడ్నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. నాడు 88 సీట్లు వచ్చాయి. ఇవాళ కూడా ఎన్నికల ప్రచారం ఇక్కడ్నుంచే ప్రారంభమైంది. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు ప్రేమ, నమ్మకం, గురి.. మీ మట్టికి అంత మహిమ ఉన్నది. హుస్నాబాద్ ప్రజలకు దక్కిన గొప్పదనం ఇది. ఎల్లమ్మ తల్లి దయతో ఈ సారి బీఆర్ఎస్ పార్టీ సెంచరీ సాధించి తీరుతుంది అని హరీశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.
మీ ఫోన్లలో బీఆర్ఎస్ మేనిఫెస్టోలను ఇప్పటికే చూసి ఉంటారని హరీశ్రావు తెలిపారు. మేనిఫెస్టో చూసి ప్రజలందరి హృదయాలు ఉప్పొంగిపోతున్నాయి. ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ దురదృస్టవశాత్తు ప్రతిపక్షాల గుండెలు వణికిపోతున్నాయి. మా పని అయిపోయిందని అనుకుంటున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తప్పడనే నమ్మకం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ వెళ్తున్న.. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని తిరిగి వస్తా అని చెప్పారు. అది సాధ్యం చేశారు కేసీఆర్ అని హరీశ్రావు పేర్కొన్నారు.
హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గోదావరి జలాలు రావాలని, రెవెన్యూ డివిజన్ కావాలని, డీఎస్పీ ఆఫీసు కావాలని, మున్సిపాలిటీ కావాలని ఇలా ఎన్నో నినాదాలు ఉండేవని హరీశ్రావు గుర్తు చేశారు. సతీశ్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ ఆశీర్వాదంతో ఆ నినాదాలను నిజం చేశారు. హుస్నాబాద్ సాగునీటితో సస్యశ్యామలంగా ఉంది. మంచినీళ్ల గోస తీర్చిండు సీఎం కేసీఆర్. హుస్నాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేశారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు అంటే కేసీఆర్కు అభిమానం, సతీశ్ బాబు ప్రజల మనిషి.. మచ్చలేని నాయకుడు. సతీశ్ బాబు, కేసీఆర్కు హ్యాట్రిక్ అందించాలని కోరుకుంటున్నాను అని హరీశ్రావు తెలిపారు.