Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో అభ్యుర్థులే దిక్కులేరని, అయినా పార్టీ నేతలు గెలుస్తామని కలలుగంటున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే సురేందర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. 2001లో గులాబీ జెండా పట్టుకున్నామని, అప్పుడు అన్నిటికీ కరువే ఉండేదన్నారు. అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన స్థాయికి వచ్చామన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. ఉద్యమ నాయకుల గడ్డ ఎల్లారెడ్డి నియోజక వర్గమని, 44 డిగ్రీల ఎండలోనూ ఇంత మంది రావడమే ఆత్మీయ సమ్మేళానికి బీఆర్ఎస్ బలానికి నిదర్శనమన్నారు. మొన్న రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్కు 500 మంది కూడా రాలేదని, అయినా కాంగ్రెస్ వాళ్లు గెలుస్తామని కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులే దిక్కు లేరని, ఎలా గెలుస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ వస్తే ఏమొచ్చిందని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నాయని, తెలంగాణ వస్తే ఏమొచ్చిందో ఏ పల్లెనడిగినా చెబుతుందన్నారు. ఈ రోజు తెలంగాణలో నీళ్ల కోసం యుద్ధాలున్నాయా? అని గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలో మంచినీళ్లు పది రోజులకోసారి వస్తాయని తెలిపారు. పుణేలాంటి నగరాల్లోనూ ఐదారురోజుకోసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. గుజరాత్లో యువతల పెళ్లికి కేవలం రూ.12వేల సాయం చేస్తారన్నారు. తెలంగాణలో కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తున్నామన్నారు. మన దగ్గర ఉన్నన్ని పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో మన పథకాలు అమలు చేసేందుకు ఓ కమిటీ వేశారంటే మన పనితీరుకు కితాబు ఇచ్చినట్టేనన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్ర, గుజరాత్లో వ్యవసాయానికి ఇంకా ఆయిల్ ఇంజిన్లు నడుస్తున్నాయని, మన దగ్గర టార్చ్ లైట్ పెట్టి వెతికినా ఆయిల్ ఇంజిన్లు కనబడవన్నారు. కరెంటు సమస్యను ఆరు నెలల్లో అధిగమించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
కరెంటు గురించి జానారెడ్డి ఎదో సవాల్ విసిరి వెనక్కి తగ్గారని, మాది ఇరిగేషన్ పాలన అన్నారు. కాంగ్రెస్ హయాంలో మైగ్రేషన్ పాలన అని, కాంగ్రెస్ అబద్దాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలు ప్రకృతి వైపరీత్యాల కన్నా దారుణంగా తయారయ్యాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతుందని, అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ దుకాణం బంద్ అయినట్టే కనిపిస్తోందని, బీజేపీ నేతలు కొందరు బీఆర్ఎస్ వైపు మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నారు. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కేట్టు లేవన్నారు. ‘గొర్రె బలంగా ఉంటే గొల్లాయనకు లాభం.. కేసీఆర్కు శక్తినిస్తే తెలంగాణకు లాభం’ అన్నారు. కేసీఆర్కు ఎల్లారెడ్డి అంటే ప్రత్యేకమైన ప్రేమ త్వరలోనే ఎల్లారెడ్డి వచ్చి వరాల జల్లు కురిపిస్తారన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి డబుల్ బెడ్ రూమ్ల కోటాలో డబుల్ కోటా ఇస్తామన్నారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.