హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని కొందరు కూహానా మేధావులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మహంతి ఆడిటోరియంలో పీఆర్టీయూఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ కూర రఘోత్తమరరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి.. హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను కలవడం సంతోషంగా ఉందన్నారు. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్పై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. త్వరలో రిక్రూట్మెంట్ భర్తీ పూర్తి చేస్తామని, ఉద్యోగుల విషయంలో ఫ్రెండ్లీ గవర్నమెంట్.. టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య వచ్చినాయి ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వమే పరిష్కరించిందన్నారు. త్వరలో ఎంప్లాయీస్ హెల్త్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు.
సమాజాన్ని దారిలో నడిపించేది మేధావులేనన్నారు. సమాజంలో అబద్ధాలను వ్యాప్తిచేసే వారి సంఖ్య
పెరిగిపోతుందని, ఇలాంటి వారికి నిజాలు తెలువాలన్నా.. పాలకుల్లో తేడాలు తెలువాలంటే సమాజంలో చర్చ జరగాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే నిజాలు మన కళ్లముందే ఉంటాయన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధి దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని గుర్తు చేశారు. మంచిని చెడును విశ్లేషించిన నాయకత్వం కలిగిన ఉపాధ్యాయులు సమాజానికి నిజాన్ని రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో అనేక వైద్య విద్య కోర్సులు ఉంటాయని, డాక్టర్లు నర్సులు బీఫార్మసీ, ఎం ఫార్మసీ, దంత వైద్య కోర్సులు ఇలా అనేకమైన కోర్సుల్లో విద్య అందించేలా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన నాడు ఎంబీబీఎస్ సీట్లు 850 మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2950కి పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా గాంధీ కాకుండా.. 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు.
ప్రస్తుతం జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటి వరకు 12 మెడికల్ కాలేజీలను ప్రారంభించామన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో 295 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండగా.. ఇప్పుడు 920కి పెరిగాయని, 4.46లక్షల మంది పిల్లలకు బోధన బోధన అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో పది శాతం కేవలం విద్యపై ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ‘ మన ఊరు – మన బడి’ ద్వారా అన్ని పాఠశాలలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. జీఎస్డీపీ 2014లో రూ.1,24,000 ఉండగా.. ఈ సంవత్సరం రూ.2,75,000 పెరిగిందన్నారు. దేశ జీడీపీ ఇప్పటికీ తెలంగాణ కంటే తక్కువనేన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.