సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సంబంధిత అధికారులతో శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయి. వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీలలో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి అని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో మున్సిపాలిటీలలోనీ అన్ని వార్డులలో రేపు (ఆదివారం) ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కమిషనర్లు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది ప్రత్యేక డ్రైవ్లో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలి అని ఆదేశించారు. ప్రత్యేక డ్రైవ్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై వైరల్ జ్వరాల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
సోమవారం నుంచి అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫోకస్డ్ గా డ్రైవ్ చేపట్టాలి అని మంత్రి హరీశ్రావు సూచించారు. వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చూడాలి. దోమలు వృద్ధి చెందకుండా అన్ని మున్సిపాలిటీల్లో క్రమం తప్పకుండా ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలి. ఆంటీ లార్వా ఆపరేషన్ లు చేపట్టి దోమల వృద్ధిని నియంత్రించాలి. దోమల నివారణ, లార్వా వృద్ధిని అరికట్టేందుకు పట్టణాల లోని అన్ని చెరువులు, కుంటల్లో విస్తృతంగా ఆయిల్ బాల్స్ ను వేయాలి అని మంత్రి హరీశ్రావు సూచించారు.