హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ నిర్మాణ పనుల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ. 1100 కోట్లతో నిర్మాణానికి పరిపాలన అనుమతులు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో నూతనంగా నిర్మించే 8 మెడికల్ కాలేజీల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ నలువైపులా నిర్మించే నాలుగు టిమ్స్ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శంకుస్ధాపన చేస్తారని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పై సోమవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆరోగ్య, అర్ అండ్ బీ , టీఎస్ఐఐసీ, టీఎస్ఎంఎస్ఐడీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా కాలేజీలకు సంబందించిన డిజైనింగ్ ఏజెన్సీలు, అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తయితే వరంగల్కు మెడికల్ హబ్గా మారుతుందన్నారు. 8 నూతన మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి అయితే తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్యతో పాటు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీల నిర్మాణం ఉండాలి. పనుల నాణ్యత విషయంలో రాజీ వద్దు. భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా, స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఆధునిక పద్దతులతో, మెరుగైన వైద్య సదుపాయాలు ఉండేలా రూపొందించాలన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలతో కూడిన వరంగల్ హెల్త్ సిటీని 215.35 ఎకరాల్లో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. 15 ఎకరాల్లో రూ. 1,100 కోట్లతో భారీ భవన సముదాయం, మొత్తం 2,000 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనునుందన్నారు. ఇందులో స్పెషాలిటీ వైద్యం కోసం 1,200 పడకలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి సేవలు అందుతాయని చెప్పారు. సూపర్ స్పెషాలిటీల కోసం 800 పడకలు ఉండనున్నాయన్నారు. ఇందులో ఆంకాలజి సహా.. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలు ఉంటాయని మంత్రి హరీశ్రావు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు టిమ్స్ తరహాలో హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని మంత్రి హరీశ్రావు చెప్పారు. గచ్చిబౌలి, సతన్నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ఏరియాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటికి 5 మెడికల్ కాలేజీల ఉంటే, తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ కృషితో 17కు పెంచుకున్నామని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా నూతన మెడికల్ కాలేజీల పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి దశలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు, రెండో దశలో 8 మెడికల్ కాలేజీలు, మూడో దశలో 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయన్నారు. మొదటి దశలో భాగంగా మహబూబ్ నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రారంభించింది. రెండో దశలో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మూడో దశలో సిరిసిల్ల, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ మెడికల్ కాలేజీలన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ పనుల నాణ్యతలో రాజీ లేకుండా ఎన్ఎంసీ నిబంధనల మేరకు భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాలు సిద్దం చేయలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డిఎంఈ రమేష్ రెడ్డి, TSMSIDC ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, అర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.