హైదరాబాద్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీశ్రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. 2020-21 సంవత్సరంలో 34 శాతం అంటే 88,467 సర్జరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని చెప్పారు. 2021-22లో ఆరోగ్య శ్రీ సర్జరీలు 43 ( 1,52,096 సర్జరీలు) శాతానికి పెంచగలిగామని తెలిపారు. ఈ ఏడాది ఆగష్టు 31 నాటికే 1,14,681 సర్జరీలు (53 శాతం) జరిగాయని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2020-21లో 34 శాతం ఉన్నఆరోగ్య శ్రీ సర్జరీలు ఉంటే, దాన్ని 53 శాతానికి పెంచగలిగామని చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఎంఆర్ఐ స్కాన్ , సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు పెరిగాయన్నారు. సీహెచ్సీలు, పీహెచ్సీలలో కూడా ఆరోగ్య శ్రీ సేవలు అందించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఆరోగ్య శ్రీ సేవలు, సర్జరీలు పెరిగాయని తెలిపారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు ఆరోగ్య శ్రీ సేవలు, సర్జరీలు తగ్గాయే సమీక్ష నిర్వహించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మిగతా జిల్లాల్లో ఆరోగ్య శ్రీ సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతుంటే ఈ మూడు జిల్లాల్లో వెనకబడటానికి గల కారణాలను తెలియజేయాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద సర్జరీలు చేసిన తర్వాత రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య మిత్రలతో పాటు ఆరోగ్య శ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుకుని సలహాలు- సూచనలు ఇవ్వాలి. ఆరోగ్యంలో ఏదైనా తేడా వస్తే వెంటనే ఆస్పత్రులకు తరలించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పేషంట్లను డిశ్చార్జ్ చేసేటప్పుడు మందులు ఇస్తున్నదీ లేనిదీ ఆరోగ్య శ్రీ సిబ్బంది పరిశీలించాలి. సక్రమంగా అవసరమైన మందులు రోగికి అందేలా చూడాలన్నారు.
ఆర్థోపెడిక్ కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ జరిగేలా చూడాలని హరీశ్రావు ఆదేశించారు. లాంగ్ బోన్ ఫ్యాక్చర్ చికిత్సలు జిల్లాలో ఎక్కువ జరిగేలా చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎక్కువ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు గల కారణాలు పరిశీలించాలని ఆదేశించారు. ఆరోగ్య మిత్రలు, జిల్లా సమన్వయకర్తలు, టీం లీడర్ల పని తీరు బాగా ఉండాలి. బాగా పని చేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పని చేయకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.
ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 90 లక్షల పేద కుటుంబాలు ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. 2014 నుండి ఇప్పటివరకు 11 లక్షల మందికి ఆరోగ్య శ్రీ సేవలు అందాయి. ఇందు కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 5,600 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రభుత్వం రూ. 826 కోట్లు ఖర్చు చేసి పేదల ప్రజకు ఉచిత వైద్య సేవలు అందించిందని తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచినందుకు గాను ఆరోగ్య మంథన్ 2022 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆయుష్మాన్ ఉత్ర్కిష్టత పురస్కారం ( AYUSHMAN UTKRISHTATA PURASKAR 2022) అందజేసిందని తెలిపారు. ఈ క్రమంలో ఆరోగ్య , వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ కర్తలు, టీం లీడర్లు పాల్గొన్నారు.