హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సహా ఎనిమిది మెడికల్ కళాశాలల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంపై మంగళవారం బీఆర్కే భవన్లో ఆరోగ్య, ఆర్అండ్బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు త్వరగా పూర్తి చేస్తే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు.
నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని కాలేజీలు ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. స్థలం వృథా కాకుండా, అన్ని వసతులు ఉండేలా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ప్రతి పేద బిడ్డకు జిల్లా పరిధిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందాలనే సీఎం కేసీఆర్ కలను సాకారం చేసేందుకు పనులు వేగిరం చేయాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో.. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.
పల్లె దవాఖానల ద్వారా గ్రామీణులకు ఎంబీబీఎస్ వైద్యుల సేవలు, మెడికల్ కాలేజీల ద్వారా సమీపంలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుతాయన్నారు. దీంతో ప్రాథమిక దశలోనే రోగాలకు చికిత్స అందించడం, ఆపత్కాలంలో వెంటనే టర్షియరి కేర్ సేవలు అందించడం సాధ్యం అవుతుందన్నారు. సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీ ఈ రాజేందర్, ప్రొఫెసర్ విమల థామస్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.