హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో 2022 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఏడాది అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. వైద్యారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ 2022లో సాధించిన ప్రగతిని వివరిస్తూ రూపొందించిన ‘వార్షిక ఆరోగ్య నివేదిక-2022’ను ఆదివారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో హరీశ్రావు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్’ అనే నినాదంతో అన్ని వయసులవారికి ఉత్తమ వైద్యసేవలు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వార్షిక నివేదికలు తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం మాత్రమే కాదని, తమ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని మరింత మెరుగు పరుచుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఆశ కార్యకర్తలు మొదలు హెల్త్ సెక్రెటరీ వరకు సమిష్టిగా పనిచేసి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్యశాఖకు రూ.11,440 కోట్లు కేటాయించారని, దీంతో ప్రజలకు మరింత మెరుగైన వసతులు కల్పించే అవకాశం కలిగిందని వివరించారు.
వినూత్న పథకాలు, కార్యక్రమాలు
2022లో అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించామని, పథకాలు అమలు చేశామని హరీశ్రావు పేర్కొన్నారు. రోగులకు పోషకాహారం అందించేందుకు డైట్ చార్జీలను రెట్టింపు చేయడంతోపాటు వారి సహాయకుల కోసం రూ.5కే భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేస్తూనే.. వాటి నిర్వహణ కోసం ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పాలసీని అమల్లోకి తెచ్చామని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు 2022లో వరంగల్ హెల్త్ సిటీతోపాటు హైదరాబాద్ నలుమూలల నాలుగు టిమ్స్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. నిమ్స్ విస్తరణతో కలుపుకొని 8,200 సూపర్ స్పెషాలిటీ పడకలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఇది దేశ చరిత్రలోనే ఒక మైలురాయి అని అభివర్ణించారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణుల కోసం న్యూట్రిషన్ కిట్ పథకం, టిఫా స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
ఓవైపు రోగులకు ఉత్తమ చికిత్స అందించేందుకు వైద్య సిబ్బందిని నియమిస్తూనే.. మరోవైపు బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించేందుకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రోగులకు ఉచితంగా మందులను ఎన్సీడీ కిట్ రూపంలో అందిస్తున్నామని గుర్తుచేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అనేక అవార్డులు ఇచ్చిందని, వీటిని చూసి పొంగిపోవడం లేదని, బాధ్యతగా భావించి మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2023లో మరిన్ని మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు లక్ష్యాలను నిర్దేశించుకొన్నామని తెలిపారు. ఈ సంవత్సరం సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ఈఎన్టీ, సరోజినీ దేవి కంటి దవాఖానల్లో మరిన్ని సదుపాయాలు కల్పించి పటిష్ఠం చేస్తామని తెలిపారు. ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సహాయంతో ఆహార కల్తీపై మరింత దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ ప్రగతి సాధించడంలో కీలక పాత్ర పోషించిన వైద్య సిబ్బందికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీపీహెచ్ శ్రీనివాసరావు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో విశాలాచ్చి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ ప్రీతి మీనా, ఉస్మానియా, గాంధీ దవాఖానల సూపరింటెండెంట్లు నాగేందర్, రాజారావు, నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ బీరప్ప పాల్గొన్నారు.
చార్జిషీట్ కాదు.. ప్రగతి నివేదిక ఇవ్వండి
ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభు త్వం అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు పనిగట్టుకొని విమర్శించడం హాస్యాస్పదంగా ఉన్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆరోగ్యశాఖపై ‘చార్జిషీట్’ పేరుతో హడావిడి చేయడంపై మండిపడ్డారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 16, ఛత్తీస్గఢ్ 10, హిమాచల్ ఏడో స్థానంలో ఉన్నాయని.. ఆ రాష్ర్టాలపై చార్జిషీట్ వేయాలని కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. డబుల్ ఇంజిన్ అని చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ర్టాలు హెల్త్ ఇండెక్స్లో అట్టడుగున ఉన్నాయని ఎద్దేవాచేశారు. ఈ నివేదిక తమకు భగవద్గీతతో సమానమని.. దీని ఆధారంగా వచ్చే ఏడాది మరింత ఉత్తమ ఫలితాలు సాధిస్తామని హరీశ్రావు ధీమా వ్యక్తంచేశారు.