హైదరాబాద్ : సినీ, సేవా, రాజకీయ రంగాల్లో నందమూరి బాలకృష్ణ అద్భుత ప్రగతి సాధిస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసలు కురిపించారు. నందమూరి తారక రామారావు ఆశయాలను బాలకృష్ణ నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 22వ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ట్రస్ట్ ఛైర్మన్ బాలకృష్ణ, సభ్యులు నామా నాగేశ్వర్ రావు సహా ఇతర సభ్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అభిమానం అని పేర్కొన్నారు. ఈ దారిలో కేసీఆర్ వెళ్తున్నప్పుడు క్యాన్సర్ ఆస్పత్రి, ఎన్టీఆర్ గురించి ఎన్నో విషయాలు గుర్తుకు చేసుకునే వారని తెలిపారు. నైట్ షెల్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పగానే బాలకృష్ణ అమలు చేశారు. బాలకృష్ణ అడగగానే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద రూ. 6 కోట్ల భారం పడకుండా సీఎం కేసీఆర్ చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని ఇది అని గుర్తు చేశారు.
క్యాన్సర్ రోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 753 కోట్లు ఖర్చు చేసిందని హరీశ్రావు తెలిపారు. ఇందులో అత్యధికంగా బసవతారకం ఆస్పత్రికి వెళ్లిందన్నారు. ఈ 22 ఏండ్లలో 3 లక్షల రోగులకు ఈ ఆస్పత్రి సేవలందించడం గొప్ప విషయమన్నారు.
క్యాన్సర్ను గుర్తించడం పెద్ద సమస్య.. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని హరీశ్రావు పేర్కొన్నారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కూడా కీమోథెరపీ, రేడియో థెరపీ ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం 300 పడకలున్న ఎంఎన్జే ఆస్పత్రిని 750 పడకలకు అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. అటామనస్ సంస్థగా రూపొందించి, ఆస్పత్రి మరింత మెరుగుపడేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. త్వరలో 8 మాడ్యులార్, రోబోటిక్ థియేటర్లను అందుబాటులోకి తీసుకొస్తామని హరీశ్రావు ప్రకటించారు.