Harish Rao | సంగారెడ్డి : స్వపరిపాలనలో సుపరిపాలన అందిస్తున్న తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ఇస్తే.. నక్సలైట్ల రాజ్యం వస్తుందని.. ప్రతి రోజూ కర్ఫ్యూ ఉంటుందని ఉద్యమ సమయంలో ఏపీ నాయకులు మాట్లాడేవారని హరీశ్రావు గుర్తు చేశారు. అసలు పరిపాలించడం చేతకాదు.. విద్యుత్ కష్టాలు మొదలవుతాయన్నారు. కానీ 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో ఏపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పామన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆరోపణల తప్పు అని కేసీఆర్ నిరూపించారు. అన్ని రంగాల్లో 24 గంటల విద్యుత్తో తెలంగాణ వెలిగిపోతుందన్నారు.
అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సుపరిపాలన అందిస్తున్నారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. తెలంగాణలో అవలంభిస్తున్న విధానాలు, అమలు చేస్తున్న పథకాలు దేశం మొత్తం అమలు చేస్తున్నారు. నిరంతర కరెంట్ సరఫరాతో పరిశ్రమలు భారీగా తరలివస్తున్నాయన్నారు. తెలంగాణ పేరు ఇవాళ దేశ వ్యాప్తంగా మార్మోగోతుందన్నారు. మన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికి రోల్ మోడల్ అయ్యాయని పేర్కొన్నారు.
చిన్న జిల్లాలు ఏర్పాటు, కలెక్టర్లు పెరగడం వల్ల ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయని హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత 769 మంది కొత్త అధికారులు ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే వచ్చారని గుర్తు చేశారు. ఏండ్ల తరబడి కొట్లాడినా మండలాలు ఇవ్వలేదు. కానీ సీఎం కేసీఆర్ 9 కొత్త మండలాలు ఇచ్చారు. 190 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు.