Harish Rao | సిద్దిపేట : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పేవాళ్లయితే.. చేతల్లో చూపేది, మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జడ్పీ చైర్మన్ రోజాశర్మతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీసీలకు చేసే ఆర్థిక సాయం పథకాన్ని మోదీ కాపీ కొట్టారని విమర్శించారు. 50 ఏళ్ల నుంచి చేయని అభివృద్ధి, ఇప్పుడు చేస్తామని బాండ్ పేపర్లు రాసిస్తున్నారని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అని మంత్రి పేర్కొన్నారు. వారంలోపు రజకుల ఫంక్షన్ హాల్ కోసం స్థలం అప్పగిస్తానని హామీనిచ్చారు. సిద్దిపేట ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంకు చాకలి ఐలమ్మ ఆడిటోరియంగా నామకరణం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఐలమ్మ అంటేనే ఉద్యమ స్ఫూర్తి.. పేదల పక్షాన పోరాడిన వీర వనిత అని మంత్రి ఆకాంక్షించారు. ఆమె పోరాటం వల్లనే ఎంతో మందిని కాపాడింది. సీఎం కేసీఆర్ ఐలమ్మ స్ఫూర్తితోనే పోరాడటం వల్లనే రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎంతో మంది ఉద్యమకారులను గుర్తించి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా 500 మంది రజకులకు ఆర్థిక సహాయం అందించాం. రైతులకు ఇచ్చే రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలు మోదీ కాపీ కొట్టారని, అయినా దేశంలో ఇప్పటికే 30 శాతం మందికి నీళ్ళు అందుతున్నాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.