సిద్దిపేట : తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. ఒకప్పుడు ఎవుసానికై ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారమని, కాలం ఎట్లయితదోనని పంచాంగ శ్రవణం వినేవారమని, కానీ సీఎం కేసీఆర్ దయతో కాలమైనా, కాకున్నా రెండు పంటలు పండిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు స్పష్టం చేశారు.
సిద్ధిపేట జిల్లా దుబ్బాక కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ మేరకు దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్గా భాస్కర్ చారి, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఇప్ప లక్ష్మి.. మంత్రి హరీశ్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ, తొగుట, దౌల్తాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికీ శుభాకాంక్షలు తెలిపారు. కాలమైనా కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో రెండు పంటలు పండిస్తున్నారని, తాగు, సాగునీరు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం, దుబ్బాక నియోజకవర్గం గోస తీర్చింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా.. ఓ వైపు రైతులకు గోస పెట్టి, మరోవైపు సైనికులకు కూడా అగ్నిపథ్తో దేశ యువతను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి మండిపడ్డారు.
విద్యుత్ మీటర్ల నిబంధన లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి యేటా రూ. 6 వేల కోట్లు, రెండేళ్లలో రూ. 12 వేల కోట్లు ఎందుకు నిలిపివేశారో బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. చట్టంలో విద్యుత్ మీటర్లు లేకపోతే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 12 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించామని, ఇందు కోసం రూ. 57 వేల 8 వందల 80 కోట్లు వెచ్చించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల కింద రైతుబీమా సాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, ఇప్పటికే 87 వేల మంది రైతుల కుటుంబాలకు రూ.4333 కోట్ల రైతుభీమా సాయాన్ని అందించినట్లు మంత్రి హరీశ్ గుర్తు చేశారు.
రైతుబంధు, అమృత్ సరోవర్, హర్ ఘర్ కో జల్, మూగజీవాలకు అంబులెన్స్ 1962లను దేశమంతా అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేంద్రం కాపీ కొట్టిందని, ఇందుకు తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తి దాయకంగా నిలిచిందని సగర్వంగా మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప ఇచ్చిందేమీ లేదని హరీశ్రావు ధ్వజమెత్తారు.