హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): వైద్యవృత్తి ఎంతో గొప్పదని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ ప్రజలకు ప్రాణదానం చేసే వైద్యులను సమాజం ఎప్పటికీ మరువదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ‘డాక్టర్స్ డే’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వైద్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో అయినవారు సైతం దూరంగా ఉంటే, వైద్యులు, నర్సులు, సిబ్బంది మాత్రం ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చారని గుర్తు చేశారు.
మేమున్నామంటూ సేవలందించి ప్రపంచాన్ని కాపాడారని, దీంతో వైద్య సిబ్బంది ప్రాముఖ్యత ఏమిటో ప్రతి ఒకరికీ అర్థమైనదని తెలిపారు. మానవాళిని కాపాడుతున్న వైద్యుల సేవలను ప్రత్యేకంగా డాక్టర్స్ డే రోజున గుర్తుచేసుకోవడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యరంగాన్ని బాగు చేయడంతోపాటు, వ్యాధుల నివారణపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమాలతో పాటు మిషన్ భగీరథ నీటితో రోగాలు తగ్గాయని చెప్పారు. హరితహారంతో స్వచ్ఛమైన గాలి అందుతున్నదని, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల ద్వారా ఉపరితల జలాలతో పండిన పంటల వల్ల పోషకాహారం అందుతున్నదని వివరించారు.
మరోవైపు దవాఖానలను బలోపేతం చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇటీవలే తెలంగాణ డయాగ్నసిక్ ద్వారా చేసే వైద్య పరీక్షలను 134కు చేర్చినట్టు చెప్పారు. 500 బస్తీ దవాఖానలు రాష్ట్రంలో సేవలందిస్తున్నాయని వివరించారు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు 30 శాతం నుంచి 70 శాతానికి పెరిగాయని, ప్రైవేటు దవాఖానల్లోనూ అమలు చేయాలని కోరుతున్నారని చెప్పారు.
వంద శాతం దవాఖాన ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం మనదేనని స్పష్టం చేశారు. ఒకప్పుడు మూడు డయాలసిస్ సెంటర్లు ఉంటే, నేడు 102కు పెంచామని, కరోనా లాంటి పరిస్థితులను ఎదురొనేలా 50 వేల పడకలు ఏర్పాటు చస్తున్నట్టు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో ఓ వైపు వైద్య సేవలు, మరోపైపు విద్యార్థులకు వైద్యవిద్య అందుతున్నదని చెప్పారు. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు 34 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. వీటన్నింటి ఫలితంగా దేశ ఆరోగ్యరంగ ర్యాంకుల్లో తెలంగాణ 11వ స్థానం నుంచి మూడో స్థానానికి ఎదిగిందని తెలిపారు. త్వరలో ప్రథమ స్థానానికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.