Minister Harish rao | సిద్దిపేట, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అద్భుత విజయాలకు.. కాంగ్రెస్ పార్టీ అబద్ధ్దాలకు మధ్య జరగబోయే కురుక్షేత్ర యుద్ధ్దంలో ధర్మమే గెలుస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ‘కాంగ్రెసోళ్లు కౌరవుల్లాగా వందలమంది వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టినా, వంద అబద్ధ్దాలు చెప్పినా, గెలిచేది ధర్మమే.. గెలిచేది సీఎం కేసీఆరే’ అని స్పష్టంచేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చింతల చెరువులో మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ 52 వేల చేప పిల్లలను వదిలారు. రాష్ట్రంలో తొలిసారి సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లోని 7,200 మంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు. ‘కాంగ్రెస్వాళ్లు పూటకో దొంగ డిక్లరేషన్ చేస్తున్రు. అదేదో వారు అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయరు? మీరెన్ని దొంగ డిక్లరేషన్లు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎప్పుడో సెల్ప్ డిక్లరేషన్ చేసుకున్నారు. ఇవ్వాళ దేశానికి తెలంగాణ రాష్ట్రం దిస్సూచిగా నిలిచింది. కాంగ్రెస్ 60 ఏండ్లు పాలించినప్పుడు ఇలా ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని విమర్శించారు.
నాడు ఎందుకు చేయలేదు?
‘చెరువులు బాగు చేసినం, కాళేశ్వరంతో నీళ్లు తెచ్చినం, ఉచిత కరెంట్ ఇచ్చినం, ఎకరానికి రూ.10 వేలు రైతుబంధు, చనిపోయిన రైతుకు రూ.5 లక్షల బీమా ఇస్తున్నం. ఏటా ఉచితంగా చేపపిల్లలు చెరువుల్లో వేస్తున్నం. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ధాన్యం పండుతున్నది దేశంలో ఎక్కువ డాక్టర్లు తయారవుతున్న రాష్ట్రం తెలంగాణ.’ ఈ నిజాలకు, కాంగ్రెస్ అబద్ధ్దాలకు వచ్చే ఎన్నికల్లో పోటీ జరుగనున్నది. 60 ఏండ్లలో మీరు చేయనిది సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో చేసి చూపారు. ఇది ప్రజలందరికీ తెలుసు’ అని స్పష్టంచేశారు. గతంలో మత్స్య కారులకు సొసైటీలో సభ్యత్వం కావాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేదని, నేడు లక్షల మందికి సభ్యత్వాలు ఇస్తున్నామని చెప్పారు. చెక్డ్యాంలకు సైతం సొసైటీలు ఏర్పాటుచేసి ముదిరాజ్, బెస్తవారికి సభ్యత్వాలు ఇస్తున్నామని తెలిపారు. ‘అప్పట్లో మృగశిర కార్తె వస్తే విజయవాడ నుంచి లారీల్లో చేప పిల్లలను తెచ్చేవారు.
ఇక్కడ చేపలు దొరక్క బెంగాల్, విజయవాడ, విశాఖపట్టణం నుంచి లారీల్లో చేపలు వస్తే కిలోకు రూ.500 రూ.1,000 పెట్టి కొనుక్కొని తినేవాళ్లం. పక్క రాష్ర్టాల నుంచి వస్తే తప్ప తెలంగాణలో చేపలు దొరకని పరిస్థితి ఉండేది. ఇవాళ సీన్ రివర్స్ అయ్యింది. మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసుకోవడంతో నీళ్లకు, చేపలకు కరువు లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ మత్స్యకారులకు గొప్ప అవకాశం ఇచ్చారు. రూ.1,000 కోట్లతో మోపెడ్లు, ఐస్ బాక్సులు, వలలు, బోట్లు అందించారు. ఏటా రూ.100 కోట్లతో ఉచితంగా చేప పిల్లలు ఇస్తూ, ఇప్పటివరకు రూ.1,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మత్స్యకారులకు రూ.2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్గా ఖర్చుపెట్టింది. గతంలో ఎప్పుడన్నా ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు చేశాయా?’ అని ప్రశ్నించారు. పాడి, చేపలు, మాంసం.. ఈ మూడు రంగాల్లో ఉత్పత్తి పెరిగిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో అటు ఐటీ పెరిగింది.. ఇటు వ్యవసాయరంగం బాగా అభివృద్ధి చెందింది. హైదరాబాద్లో మాదిరిగానే గ్రామాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని హరీశ్రావు వివరించారు.
సంపద పెంచి పంచుతున్న కేసీఆర్: తలసాని
పెరిగిన సంపదను పేద వారికి పంచాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని.. కులవృత్తుల మీద ఆధారపడిన జీవితాల్లో వెలుగులు నింపాలన్న కేసీఆర్ సంకల్పం చాలా గొప్పదని కొనియాడారు. మత్స్యకారులను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నదే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ‘మత్స్యకారులకు ఐడీ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నుంచే ప్రారంభిస్తున్నాం. 18 సంవత్సరాలు నిండినవారికి సొసైటీలో సభ్యత్వం ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. నూటికి నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమం దేశంలో మరెక్కడా లేదు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, మత్య్సశాఖ కమిషనర్ లచ్చీరాం భూక్యానాయక్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మత్స్య సహకార సంఘం ఫెడరేషన్ చైర్మన్ డీటీ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.