సిద్దిపేట, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతుల పంట పొలాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పారుతుంటే కాంగ్రెస్, బీజేపీ నేతల కండ్లు మండుతున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. విపక్ష నేతలు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం నీటితో ఒక్క ఎకరం కూడా పారుతలేదని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘కండ్లు ఉండి చూడలేక పోతుండ్రా? చెవులుండి వినలేక పోతుండ్రా? పొలాల్లో కాళేశ్వరం నీళ్లు పారుతుంటే విపక్ష నేతల కండ్లల్లో కన్నీళ్లు వస్తున్నాయి. వాళ్ల కండ్లు ఎర్రబడుతున్నాయి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయం నుంచి చిన్నకోడూరు వరకు రూ.66 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు మంగళవారం మంత్రి భూమిపూజ చేశారు.
రంగనాయక సాగర్ ఎడమ కాల్వ నుంచి నారాయణరావుపేట, చిన్నకోడూరు మండలాలకు సాగు నీటిని విడుదల చేశారు. సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మెట్టుబండల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్ర రైతులు లాభపడటాన్ని కాంగ్రెస్, బీజేపీ ఓర్చుకోలేకపోతున్నాయని దుయ్యబట్టారు. ‘తెలంగాణ రాష్ట్రం రాకపోయినా, కేసీఆర్ సీఎం కాకపోయినా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవా? ఈ అభివృద్ధి జరిగేదా? ఇంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదా? ఇదంతా సాధ్యమైందంటే అది సీఎం కేసీఆర్ చలవే’ అని స్పష్టంచేశారు. భగీరథ ప్రయత్నం చేసి ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లను మన పొలాలకు పారిస్తున్నారని కొనియాడారు.
కాళేశ్వరంతో కళకళ
కాళేశ్వరం వల్లనే నేడు ఎక్కడ చూసినా గుంట జాగ ఖాళీ లేకుండా నాట్లు వేశారని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల హయాం లో సగానికి సగం పంటలు ఎండిపోయేవని, నేడు కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ర్టానికి వరంలా మారిందని చెప్పారు. ప్రతిపక్ష నేతలు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడటం కాద ని, గల్లీలకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశా రు. ఇక్కడికి వచ్చి రైతులను కలిస్తే లాభం జరిగిందా లేదా అనేది చెప్తారని అన్నారు. ‘పండిన పంటలను చూడండి. పచ్చని పొలాలను, కాల్వల్లో నీటిని, నిండిన చెరువులను, పొంగి పొర్లిన చెక్డ్యాంలను చూడండి. కాళేశ్వరం ప్రతిఫలం ఏంటో తెలుస్తది’ అని హితవు పలి కారు. గతంలో గొర్రెలు, మేకలకు తాగడానికి నీళ్లు దొరకలేదని, నేడు నీటి లభ్యత పెరిగిందంటే అది కాళేశ్వరం పుణ్యమే అని నొక్కిచెప్పారు. రైతులకు నీటిని విడుదల చేయాలని ఆదేశించిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన హరీశ్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన రవీందర్రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాధాకృష్ణశర్మ, ఎంపీపీ మాణిక్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.