Minister Harish Rao | కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్హెచ్ఎం కార్యక్రమాలపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్ఎంఎస్ఐడీసీ పరిధిలో పురోగతిలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.35కోట్లతో గాంధీ ఆసుపత్రిలోని 8వ పూర్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.
రూ.16.5 కోట్లతో గాంధీ, ఎంజీఎం, పేట్ల బుర్జు ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తున్న ఫెర్టిలిటీ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్, నర్సింగ్ కాలేజీలు నిర్మాణాలు వేగవంతం చేసి, లక్ష్యంలోగా పూర్తి చేయాలన్నారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్స్ ప్రారంభించాలని చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీల పనులు సకాలంలో పూర్తి చేయాలని చెప్పారు.
అనవసర సీ సెక్షన్లు తగ్గించేందుకు కృషి చేయాలని, 100శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చూడాలన్నారు. ప్రత్యేక శిక్షణ పొందిన మిడ్ వైఫ్ స్టాఫ్నర్స్ల సేవలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, సాధారణ ప్రసవాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. గర్భిణుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆధునిక టిఫా స్కానింగ్ వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా చూడాలన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 14న నిర్వహించే వైద్య ఆరోగ్య దినోత్సవాన్నిపండుగగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.
అదే రోజున కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, టీఎస్ ఎంఎస్ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.