సిద్దిపేట : తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని. ఇందులో భాగంగా ధాన్యం కొనుగోలు పూర్తయిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్రావు(Minister Harish Rao) వెల్లడించారు. శనివారం సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని వెల్కటూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Paddy Centres) ప్రారంభించారు
. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనమని చెప్పినా సీఎం కేసీఆర్(CM KCR) కొంటామని ధైర్యం చెప్పి అందుకనుగుణంగా రాష్ట్రమంతటా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సిద్దిపేట జిల్లాలోనే మొదటి సారిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు.
నియోజకవర్గంలోనే మొదటి సారిగా డబుల్ బెడ్ రూం(Double Bed Room) ఇండ్లను నిర్మించి ప్రారంభించుకున్నామని ఆయన గుర్తు చేశారు. వెల్కటూర్ గ్రామంలో కాలుకు మట్టి అంటకుండా సీసీ రోడ్లు నిర్మించామని వివరించారు. మరో వారం రోజుల్లో మరికొన్ని అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే గృహలక్ష్మి పథకం ద్వారా వెల్కటూర్ గ్రామానికి ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.