హయత్నగర్: ఎల్ఐసీ ఏజెంట్లు అద్భుతంగా పనిచేస్తారని, ఆ విషయంలో తనకు సంపూర్ణ అవగాహన ఉన్నదని మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. హయత్నగర్లో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ ఎల్ఐసీ ఏజెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రజల కోసమా, రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమా మీరే ఆలోచించాలని ఎల్ఐసీ ఏజెంట్లకు మంత్రి సూచించారు. నాలుగేండ్ల కింద ఓటు వేస్తే రాజగోపాల్రెడ్డి ఒక్కసారి కూడా తమ ఊరికి రాలేదని, సమస్యలు పరిష్కరించలేదని ప్రజలు చెప్పినట్లు ఆయన తెలిపారు.
తాము 70 ఏండ్ల ఫ్లోరైడ్ భూతాన్ని మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చి తరిమి కొట్టామని మంత్రి చెప్పారు. దేశంలో ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం బాయిలకాడ మీటర్లు పెట్టాలి అంటున్నదని, మీటర్లు పెడితే 6000 కోట్లు ఇస్తమంటూ ఒప్పందంపై సంతకం పెట్టమన్నారని, కానీ65 లక్షల మంది రైతుల భవిష్యత్ కోసం తాము ఒప్పుకోలేదని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలు సంతకాలు పెట్టాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఇక్కడి ప్రజల కోసం కేంద్రం చేసిన ఒక్కపనైనా ఉన్నదా అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నదని ఆరోపించారు. ఎల్ఐసీని కూడా అమ్మకానికి పెట్టిందని గుర్తుచేశారు. మతం పేరుతో చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందటం తప్ప బీజేపీ ఇక్కడి జనం కోసం చేసిందేమీ లేదన్నారు. 20 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న ఎల్ఐసీని అడ్డికి పావుషేరు లెక్కన అమ్ముతున్నారని, దాంతో ఎల్ఐసీకి భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు.
LIC రక్షణ కోసం BRS అండగా ఉంటుందని హరీశ్రావు చెప్పారు. ఎల్ఐసీ ఏజెంట్లు అంటే మామూలు వ్యక్తులు కాదు శక్తులని, ఎంతో మందిని ఒప్పించే శక్తి మీలో ఉందని వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మునుగోడు అభివృద్ధి, అక్కడి ప్రజల బాగు కోసం పని చేయాలని వారిని కోరారు. ఈ ఎన్నికలు రాజ గోపాల్ రెడ్డి అహంకారం, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అన్నారు. ఎల్ఐసీ ఏజెంట్లకు చౌటుప్పల్లో భవన నిర్మాణం కోసం నిధులు ఇస్తామన్నారు. ఎన్నికల తర్వాత వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్లు తెలిపారు.