Choutuppal | చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంగళవారం వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 36 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చౌటుప్పల్ ఆస్పత్రితో పాటు నియోజకవర్గంలోని 4 పీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.
చౌటుప్పల్లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆస్పత్రిగా మార్చడం ద్వారా సమీప ప్రాంతాల్లో ప్రజలకు నయాపైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్యసేవలు అందనున్నాయి. ఈ దవాఖానలో ప్రతి నిత్యం సుమారు 300 మందికిపైగా ఓపీ సేవలు పొందుతున్నారు. నెలకు 50 వరకు ప్రసవాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా 65వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు సైతం ఇక్కడేకు వస్తుంటారు. అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో లేక రోగులు ప్రైవేటు దవాఖానలకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారు. వీటి దృష్ట్యా మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సమయంలో చండూర్ బహిరంగ సభలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నియోజకవర్గంలో 100 పడకల దవాఖాన కావాలని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అభ్యర్థన మేరకు వంద పడకలకు హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు.
ఈ దవాఖానలో 100 పడకలు వస్తే పేదలకు నయాపైసా ఖర్చుల లేకుండా 24గంటల వైద్య సేవలు అందనున్నాయి. చౌటుప్పల్తో పాటు సంస్థాన్నారాయణపురం, వలిగొండ, భూదాన్పోచంపల్లి, చిట్యాల, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నా యి. ప్రస్తుతం ఇక్కడ 5గురు వైద్యులు సుమా రు 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వంద పడకల దవాఖానగా మారితే అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయనున్నారు. జనరల్ సర్జన్తోపాటు ఎముకల, చిన్న పిల్లల, చెవు, ముక్కు, గొంతు, గైనకాలజి, అనస్తీషియా ప్రత్యేక విభాగాల వైద్యులు సేవలు అందుబాటులోకి రానున్నాయి. 20 మంది పైగా వైద్యులు ఇక్కడకు రానున్నారు. 100 మందికి పైగా ఇతర సిబ్బంది కూడా పనిచేయనున్నారు. ప్రత్యేక బ్లడ్ బ్యాంక్, ఐసీయూ కూడా ఏర్పాటు కానుంది. తద్వారా వివిధ రకాల రోగాలకు శస్త్ర చికిత్స చేయనున్నారు. 65వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకోవడంతో క్షతగ్రాతులకు ప్రథమ చికిత్స చేసి హైదరాబాద్కు తరలిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రైవేటు దవాఖానకు వెళ్లి అప్పుల్లో కూరుకుపోతున్నారు. అంతేకాకుండా గాయపడిన వారి బంధువులు ఇతర ప్రాంతాల్లో ఉండటంతో వారు ఇక్కడ రావడం ఆలస్యం అవుతున్నది. దాంతో ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి తక్షణమై ఐసీయూ,శస్త్ర చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో మృత్యువాత పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వాటికి చెక్ పెట్టె అవకాశాలు ఉన్నాయి.