హైదరాబాద్ : కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో 50 పడకల సీహెచ్సీ ఆస్పత్రి ప్రారంభంతో పాటు 12-14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. నేషనల్ వ్యాక్సినేషన్ డే సందర్భంగా 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం సంతోషంగా ఉందన్నారు. కరోనా అయిపోయిందని, ఇక లేదని అనుకోవడం పొరపాటు. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం ఇంకా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వేవ్లో కరోనా ప్రభావం చూపలేదని, టీకా అవసరం లేదనే నిర్లక్ష్య ధోరణి పెట్టుకోవద్దు. చైనా, అమెరికా, హాంకాంగ్లో కొత్త కేసులు వస్తున్నాయని వింటున్నాం. డబ్ల్యూహెచ్వో కూడా అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది. వ్యాక్సిన్ను ప్రతి ఒక్కరూ విధిగా వేసుకోవాలని హరీశ్రావు సూచించారు.
ప్రపంచంలో కొత్త వ్యాక్సిన్ రావాలంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. భారతదేశంలో కరోనా నివారణకు వచ్చిన మూడు వ్యాక్సిన్లలో రెండు హైదరాబాద్ నుంచి వచ్చినవే.. గర్వకారణంగా ఉంది. భారత్ బయోటెక్ నుంచి వచ్చిన కొవాగ్జిన్, బయోలాజిక్ ఈ సంస్థ నుంచి వచ్చిన కొర్బెవాక్స్ అని తెలిపారు. ఈ రెండో వ్యాక్సిన్ కొర్బెవాక్స్ 12 నుంచి 14 ఏండ్ల లోపు పిల్లలకు వేస్తున్నారు. బయోలాజిక్ ఈ సంస్థ ఎండీ మహిమా దాట్లకు హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అద్భుతమైన విజయాలు సాధించారు. ఆమె మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటూ, ప్రభుత్వం భవిష్యత్లోనూ ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు.
రాష్ట్రంలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 106 శాతం పూర్తి చేసుకున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ 97 శాతం పూర్తి చేసుకున్నాం. 15 -17 ఏండ్ల లోపు పిల్లలకు సంబంధించి 87 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు. 12 -14 ఏండ్ల లోపు పిల్లలకు ఇవాళ ప్రారంభమైంది. వీరు మైనర్లు కాబట్టి.. తల్లిదండ్రులు చొరవ చూపి వ్యాక్సిన్ వేయించాలి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. 17 లక్షల మంది పిల్లలు ఉంటారని అంచనా వేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు.
60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని గతంలో కేంద్రానికి లేఖ రాశాం. ఇందుకు కేంద్రం అంగీకరించిందని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 60 ఏండ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోసు ఇస్తామన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంది. మరణాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిశీలనలో తేలిందన్నారు. కరోనా తీవ్రత లేదని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేయించుకొని సురక్షితంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో విరామం లేకుండా పని చేస్తున్న ఆశా వర్కర్లకు మంత్రి హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో సేవలు అందించిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని హరీశ్రావు స్పష్టం చేశారు.