హైదరాబాద్ : కరోనా మహమ్మారి పట్ల వ్యాక్సిన్ ఒక రక్షణ కవచంలా పని చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోకపోతేనే సమస్య.. తీసుకుంటే భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలు పాటించాలి. మాస్కు ధరించాలి. ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు అని సూచించారు. బంజారాహిల్స్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మంత్రి హరీశ్రావు, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలు.. 18 లక్షల 70 వేల మంది వరకు ఉన్నారు. వీరందరికి త్వరితగతిన, వేగవంతంగా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. 2007 తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాంటి గుర్తింపు కార్డు అవసరం లేదు. తెలంగాణ వ్యాప్తంగా 1014 సెంటర్లు ప్రారంభించాం. హైదరాబాద్తో పాటు 12 కార్పొరేషన్లలో పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే టీకా వేయించుకోవాలి. ఇతర పట్టణాలు, మండలాల్లో నేరుగా వ్యాక్సిన్ వేయించుకునే అవకాశం కల్పించాం. హైదరాబాద్తో పాటు 12 కార్పొరేషన్లలో రద్దీ ఏర్పడొద్దనే ఉద్దేశంతోనే రిజిస్ట్రేషన్కు ఆదేశాలిచ్చాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, డాక్టర్ల సమక్షంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మీ పిల్లలకు విధిగా వ్యాక్సిన్ ఇప్పించండి అని తల్లిదండ్రులకు హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. 15 ఏండ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇప్పించేలా అన్ని కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే పాజిటివిటీ రేటు 4 రెట్లు పెరిగిందన్నారు. గత వారం రోజుల నుంచి ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 60 ఏండ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని, పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కేంద్రం అనుమతి మేరకు 15 నుంచి 18 ఏండ్ల వయసున్న పిల్లలకు కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ వేస్తున్నాం. 4 వారాలు కాగానే సెకండ్ డోసు ఇస్తామని హరీశ్రావు పేర్కొన్నారు. 60 ఏండ్లు పైబడిన వారికి, ఫ్రంట్ లైన్ వారియర్స్కు బూస్టర్ డోసు జనవరి 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 21 లక్షల హోంఐసోలేషన్ కిట్లు రెడీ చేశాం. తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంది. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే మీకు సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. మెడిసిన్స్ను కూడా ఉచితంగా ఇస్తున్నాం. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు అని సూచించారు.
ఖైరతాబాద్ ఆస్పత్రిని అభివృద్ధి చేసి బెడ్స్ పెంచాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి హరీశ్రావు చెప్పారు. మెటర్నిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలి. 100 శాతం వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాలను కేంద్ర మంత్రి అభినందించారు. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది అని మంత్రి హరీశ్రావు తెలిపారు.