నేనూ ప్రయత్నిస్తున్నా.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో, మాస్టర్ ట్రైనర్ ఆధ్వర్యంలో సీపీఆర్ చేయడాన్ని నేనూ ప్రయత్నిస్తున్నా. హైదరాబాద్లోని అన్ని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి సీపీఆర్ ప్రక్రియపై లక్ష మందికి శిక్షణ ఇవ్వనున్నాం. తద్వారా కనీసం కొన్నయినా విలువైన ప్రాణాలను కాపాడగలుగుతామని ఆశిస్తున్నా.
– ట్విట్టర్లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’లు (ఆకస్మిక గుండెపోట్లు) పెరిగాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గుండెపోటుకు గురైన వారికి వెంటనే కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) చేయగలిగితే ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఉన్నాయని, సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. సీపీఆర్ ప్రయోజనాలను గుర్తించిన సీఎం కేసీఆర్.. గొప్ప ఆలోచనతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు బుధవారం మేడ్చల్లోని జీవీకే ఈఎంఆర్ఐ వేదికగా మంత్రలు హరీశ్రావు, కేటీఆర్, మల్లారెడ్డి కలిసి సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు ముగ్గురు సీపీఆర్ గురించి తెలుసుకోవడంతోపాటు, స్వయంగా ఆ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్య, మునిసిపల్, పంచాయతీరాజ్, పోలిస్ తదితర శాఖల సిబ్బందికి సీపీఆర్పై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు, ఎంపీటీసీలతోపాటు ప్రజలతో నేరుగా సంబంధమున్న అన్ని విభాగాలవారికి సీపీఆర్ శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన మంత్రి కేటీఆర్దని చెప్పారు. ఆయన మామ హరినాథరావు మరణించినప్పుడు పరామర్శించడానికి వెళ్లానని గుర్తు చేశారు. హరినాథరావుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని, సీపీఆర్ తెలిసినవారు లేకపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిసి ఎంతో బాధ కలిగిందని పేర్కొన్నారు. అప్పుడు మంత్రి కేటీఆర్తో జరిగిన చర్చ ఫలితంగానే రాష్ట్రవ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
సడెన్ కార్డియాక్ అరెస్ట్ వల్ల దేశంలో రోజుకు సగటున 4 వేల మంది చొప్పున ఏటా 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తెలంగాణలోనూ ఏటా 24 వేల మంది చనిపోతున్నారని హరీశ్రీవు తెలిపారు. ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ అయిన ప్రతి 10 మందిలో ఒక్కరు మాత్రమే బతుకుతున్నారని, సకాలంలో సీపీఆర్ చేస్తే కనీసం ఐదుగురిని బతికించుకోవచ్చని ప్రపంచ అరోగ్య సంస్థ, ఇతర సంస్థలు చెప్తున్నాయని పేర్కొన్నారు. పక్కన ఉన్నవారు స్పందించి వెంటనే సీపీఆర్ చేస్తే గుండె ఆగిపోకుండా చూడొచ్చని ఇటీవల రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్, వరంగల్ డీఎంహెచ్వో వెంకటరమణ నిరూపించారని ఉదహరించారు. ఇదే వేదిక మీద ఆ ఇద్దరినీ మంత్రులు సన్మానించడం విశేషం.
మాల్స్, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లతోపాటు ఎక్కువ మంది ప్రజలు ఉండే ప్రాంతాల్లోని వారందరికీ శిక్షణ ఇస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇకపై అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, మాల్స్, బస్టాండ్ల నిర్మాణ సమయంలోనే అగ్నిమాపక సాధనాల మాదిరిగానే ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ)లను విధిగా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు లేఖలు రాస్తామని, తొలి విడతగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూ.18 కోట్లతో 1,200 ఏఈడీ మెషీన్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల్లోగా అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, బస్తీ దవాఖానల్లో ఏఈడీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో తెలంగాణ వైద్యరంగం అద్భుతంగా పురోగమిస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బస్తీ దవాఖానలు మొదలుకొని సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతోపాటు టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నదని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే ప్రభుత్వ వైద్యంపై రాష్ట్ర ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. శారీరక శ్రమ తగ్గడం, జీవన శైలి మారడం వల్ల బీపీ, మధుమేహం (డయాబెటిస్), గుండెపోట్లు లాంటి లైఫ్ సె్టైల్ డిసీజెస్ పెరిగాయని, ఇప్పుడు మన దేశం డయాబెటిస్ హబ్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తన మామ హరినాథరావు గుండె పోటుతో మరణించడంపై మంత్రి హరీశ్రావుతో చర్చించానని, దీంతో సీపీఆర్పై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిద్దామని చెప్పిన హరీశ్.. ఇప్పుడు ఆ మాటను కార్యరూపంలోకి తీసుకొచ్చారని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం లక్ష మందికి సీపీఆర్పై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ శిక్షణతో సంవత్సరానికి 5 ప్రాణాలు కాపాడినా.. 5 కుటుంబాలను కాపాడినట్టేనని చెప్పారు. అన్ని అంశాల్లో మాదిరిగానే సీపీఆర్పై శిక్షణలోనూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సీపీఆర్పై రాష్ట్రవ్యాప్త శిక్షణ కార్యక్రమాన్ని తన నియోజకవర్గం నుంచి ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
అనుకోని ప్రమాదాలు, దుర్ఘటనలు, అధిక శారీరక శ్రమ జరిగినప్పుడు మనిషి సైకలాజికల్ షాక్కు గురవుతాడు. ఈ సమయంలో హృదయ స్పందనలో తేడా వస్తుంది. ఫలితంగా గుండె లయ తప్పి ఆగిపోతుంది. శ్వాస తీసుకోవడం సైతం నిలిచిపోతుంది. ఆ సమయంలో ఛాతీపై పదే పదే ఒత్తిడి చేయడం, నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించడం ద్వారా గుండెను, ఊపిరితిత్తులను తిరిగి పనిచేయించడాన్నే సీపీఆర్ అంటారు. దీన్ని తెలుగులో హృదయ, శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ అంటారు. ఇంత చేసినా కొన్నిసార్లు గుండె స్పందించదు. ఆ సమయంలో ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ (ఏఈడీ) అనే వైద్య పరికరం ద్వారా ఛాతీ నుంచి గుండెకు స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా గుండెను తిరిగి పనిచేయించేందుకు వీలుంటుంది.