Harish Rao | సిద్దిపేట : సిద్దిపేటకు ఐటీ టవర్ రావాలన్నది నా కల.. ఇవాళ ఆ కల నిజంగా కళ్లకు కనబడుతున్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజల ఆకాంక్షలు అమలు చేస్తుంటే ఆ ప్రజాప్రతినిధికి మరింత శక్తి వస్తుందన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట శివారులో ఉన్న ఐటీ టవర్లో ఎమ్మెల్యే సతీశ్, ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్లతో కలిసి సిద్దిపేట హబ్ ఐటీ వెబ్ సైట్ను హరీశ్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఐటీ టవర్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఫేజ్-1 పూర్తికాగానే ఫేజ్-2 ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఐటీ టవర్లో టాస్క్ ద్వారా శిక్షణ తరగతులు బాగా జరుగుతున్నాయని వివరించారు. సిద్దిపేటలో సొంతంగా ఐటీ టవర్ పెట్టాలని అనుకునే వారికి కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పనతో పాటు కావాల్సిన అనువైన స్థలాన్ని ఇస్తామని ఐటీ పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులు, ప్రెషర్స్ టాస్క్లో చేరి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఇటీవల 7 కంపెనీలు నిర్వహించిన జాబ్ మేళాలో ఎంపికైన ఉద్యోగులకు జాబ్ ఆఫర్ లెటర్స్ అందించారు.
అంతకు ముందు ఐటీ కంపెనీ నిర్వాహకులు మాట్లాడుతూ.. 18 కంపనీలకు ఎంపికైన ఉద్యోగులకు టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెలలోపు వెయ్యి మంది ఈ ఐటీ టవర్లో ఉద్యోగులుగా ఉంటారని పేర్కొన్నారు. కాగా న్యూజెర్సీ బేస్డ్, బెంగళూరు, చెన్నై బేస్డ్ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు సిద్ధిపేట యువతలో చాలా టాలెంట్ ఉన్నదని, తమ కంపెనీల్లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.