మంత్రి హరీశ్రావు: కిషన్ అన్న…
మా సర్కారుకు ఎన్ని మార్కులేస్తవే?
రైతు కిషన్ : వందకు వంద ఏస్తం
మంత్రి: మేం మంచిగ పనిజేస్తున్నమా? లేదా
రైతు: మంచిగ పనిజేస్తున్నరు..
మంత్రి: ఊర్లె మాకు వంద ఓట్లుంటే ఎన్ని పడ్తయే
రైతు: వందకు వంద మీకే పడ్తయ్
సిద్దిపేట/నారాయణరావుపేట, జూన్ 1 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మాటిండ్ల గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు భోజనం చేస్తూ.. నాంపల్లి కిషన్ అనే వ్యక్తితో చిట్చాట్ చేశారు. ‘ఏం కిషనన్నా.. మేం మంచిగానే పని చేస్తున్నామా? మా పార్టీ పని తీరుకు ఎన్ని మార్కులేస్తవే’ అని ఆత్మీయంగా పలుకరించారు. మాటిండ్లలో నాకు వందకు ఎంత మంది ఓటేస్తరని మంత్రి అడగ్గా.. వందకు వంద మంది వేస్తరు అని రైతు సమాధానమిచ్చాడు. ‘ఊరన్నకాడ ఒక్క ఇల్లు కూడా ఉండదా మాకు ఓటెయ్యనిది’ అని మంత్రి చమత్కరించారు. ‘లేదు.. లేదు.. వంద ఓట్లు మీ పార్టీకే పడతయ్.. ఈడ ఎవరికీ ఇంకో ఓటు పోదు’అని రైతు స్పష్టం చేశాడు. ‘మరి మీరడగినయ్.. మేం జెయ్యని పనులు ఇంకా ఏమన్నా ఉన్నాయా?’ అని మంత్రి అడగ్గా.. ‘అన్ని పనులు పూర్తయినయ్.. ఇక చేయాల్సిన పనులేమీ లేవ’ని బుక్క నోట్లో పెట్టుకుంటూ రైతు నవ్వుతూ సమాధానమిచ్చాడు.
అభివృద్ధి, సంక్షేమ పాలన అందించడంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఫెయిల్ అయ్యాయని మంత్రి హరీశ్రావు విమర్శించారు. నారాయణరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. సిద్దిపేట పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలకు గుక్కెడు తాగునీరు అందడం లేదని తెలిపారు. తెలంగాణలో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీటిని అందిస్తున్నట్టు చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతులకు కరెంట్ అందించలేక 20 లక్షల ఆయిల్ ఇంజిన్లను నడిపిస్తున్నదని ఎద్దేవా చేశారు. మన పక్క రాష్ర్టాలైన కర్ణాటక, ఛత్తీస్గఢ్,ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ ఇస్తే తెలంగాణలో 24 గంటల కరెంట్ను అందిస్తున్నట్టు తెలిపారు. దేశంలో కరెంట్ లేక చీకట్లు కమ్ముకొంటే.. తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్ ప్రాంతాల్లో ఆరు రోజులకోసారి తాగునీరు వస్తున్నదని అక్కడి ప్రజలు చెప్తున్నారని అన్నారు.
కానీ, సీఎం కేసీఆర్ పుణ్యమాని తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజూ మంచినీరు మన నట్టింటికి వస్తున్నదని తెలిపారు. దేశంలోని 16 రాష్ర్టాల్లో మహిళలు బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారని, కానీ, దేశంలోనే బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సంకల్పంతో మండుటెండల్లోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ 35 ఏండ్ల పాలనలో రైతులకు ఏనాడు నాణ్యమైన కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్లతో రైతుల వేదన అంతా ఇంత కాదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఎకరాకు సాగునీరందించేందుకు మూడేండ్లలోనే కాళేశ్వరం కట్టి రైతుల గోసను తీర్చామని చెప్పారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు.