హైదరాబాద్ : గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, 50వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవనం అభివృద్ధి, 50 పడకల ప్రభుత్వ మాతాశిశు ఆసుపత్రి భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే ఉచిత డయాలసిస్ కేంద్రం-రక్త శుద్ధీకరణ కేంద్ర ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హుస్నాబాద్ ఆసుపత్రికి ఇక 100 పడకల ఆసుపత్రిగా మారిందని, 2.85లక్షలతో డయాలసిస్ ప్రారంభించుకున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్ కోసం రూ.2కోట్ల మంజూరు చేశామన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు మిగిలిన భూ సేకరణకు రూ.23 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రాజ్టెక్టు పూర్తి చేసేందుకు, రైతుల ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులను కోరుతున్నారన్నారు. రాజకీయాల కోసం కాకుండా.. రైతుల కోసం ఆలోచించాలని, ప్రాజెక్టు పనులు అడ్డకోవద్దని, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో 3 ఎంసీహెచ్లకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. వాటిలో మొదటిది హుస్నాబాద్, తెలంగాణ రాష్ట్రం రాకముందు మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండేవని, ఇవాళ 102 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీశ్, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.