సిద్దిపేట : సిద్దిపేటను విద్య, వైద్య క్షేత్రంగా మారుస్తున్నాం. 1350 మంది ఏంబీబీఏస్ విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
చిన్నకోడూరు మండలం రామంచ శివారులో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
సిద్దిపేటకు బీ ఫార్మసీ కళాశాల రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో వేలాది మంది గ్రామీణ విద్యార్థులకు విద్యనందించడం గొప్ప విషయం అని ప్రశంసించారు. రూ. 26 కోట్లతో ఈ బీ ఫార్మసీ కళాశాల నిర్మిస్తున్నారు.
ఎగ్జిబిషన్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ విద్యా సేవ చేస్తున్నారని మంత్రి తెలిపారు. అలాగే భవిష్యత్లో ప్రభుత్వంతో మాట్లాడి యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రాంత విద్యార్థులకు అవసరమైన, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను ఏర్పాటు చేస్తాం. కళాశాల భవన నిర్మాణానికి., ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీనిచ్చారు.
సిద్దిపేటలో ఎల్అండ్ టీ సంస్థతో 500 మందికి శిక్షణ, ఉపాధి కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.