మెదక్ : ప్రజల నమ్మకానికి మారుపేరు కేసీఆర్ అయితే అమ్మకానికి మారుపేరు ప్రతిపక్షాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్రావు (Minister Harish Rao) విమర్శించారు. బుధవారం మెదక్ జిల్లాలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బహిరంగ సభలో ప్రతిపక్షాలపై మంత్రి విరుచుకుపడ్డారు. ప్రతి పక్షాలు సీట్లు అమ్ముకుంటారు. అన్ని అమ్ముకుంటారని దుయ్యబట్టారు.
నమ్మకం ఒక వైపు ఉంది. అమ్మకం ఇంకో వైపు ఉందని అన్నారు. మెదక్ జిల్లా కావాలి అనేది దశాబ్దాల కలని , నాడు ఇందిరా గాంధీ మాట ఇచ్చి తప్పారని, నేడు కేసీఆర్ జిల్లా చేసి చూపించారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి తిట్ల పురాణమని ఆరోపించారు. మీరు తిట్లలో పోటీ పడితే మేం పంట పండించే పనిలో బిజీ ఉన్నామని వెల్లడించారు.
సమైక్య పాలనలో అన్నం తినడానికి లేని పరిస్థితి ఉంటే నేడు ఇతర రాష్ట్రాలకు అన్నం పెట్టే స్థాయికి ఎదిగామని ఆయన అన్నారు. బక్క పలుచని కేసీఆర్ తో తెలంగాణ వాస్తదా అని ఎగతాళి చేసిన నాయకులకు కేసీఆర్ తెలంగాణ తెచ్చి చూపించారని, కాళేశ్వరం (Kaleshwaram) పూర్తి చేసి ప్రతి పక్షాల నోరు మూయించాడని పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు.