హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడంచెల వైద్య వ్యవస్థను ఐదంచెల వ్యవస్థగా తీర్చిదిద్దినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా నూతన నిమ్స్ను, వరంగల్ హెల్త్ సిటీని నిర్మిస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు- 2023 ను ఆదివారం మండలిలో హరీశ్రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లు లక్ష్యాలు, ఉద్దేశాలను మంత్రి వివరించారు. సూపర్స్పెషాలిటీ వైద్యసేవలకు నిమ్స్, ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానలపై ప్రజలు ఆధారపడుతుండటం తో సూపర్ స్పెషలిటీ సేవలను అందించేందుకు టిమ్స్ దవాఖానల ఏర్పాటు కోసం టిమ్స్యాక్ట్ -2023ను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన, ఎయిమ్స్ మాదిరి స్వయం ప్రతిపత్తి గల వైద్య విజ్ఞాన సంస్థ, స్పెషాలిటీ-సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, స్పెషాలిటీ-సూపర్ స్పెషాలిటీలో వైద్య విద్య, 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు, పారామెడికల్ విద్య, గుండె, కిడ్నీ, లివర్ వంటి 30 విభాగాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందించడం బిల్లులోని ప్రధాన అంశంగా వివరించారు.
అందుబాటులోకి సూపర్స్పెషాలిటీ సేవలు
సభ్యులు జీవన్రెడ్డి, నర్సిరెడ్డి తదితర సభ్యులు లేవనెత్తిన అనుమానాలకు హరీశ్రావు నివృత్తి చేస్తూ.. పదివేల పడకలతో సూపర్ స్పెషాలిటీ వసతులతో దవాఖానలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నామని చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మించుకున్నామని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు సేవలు అందిస్తాయని వివరించారు. 2014లో 17వేల పడకలు ఉంటే.. ఇప్పుడు 34వేల పడకలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. టిమ్స్లో 30 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనున్నామన్నారు.
హెల్త్ హబ్గా హైదరాబాద్..
హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, వ్యాక్సిన్ హబ్గా ఉన్నదని మంత్రి చెప్పారు. ఇప్పుడు హెల్త్ హబ్గా మారిందని వెల్లడించారు. 30 కోట్లతో రోబో ఎక్విప్మెంట్ సర్జరీలు నిమ్స్ లో జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎయిర్ అం బులెన్స్ ద్వారా హైదరాబాద్కు వచ్చి వైద్యం పొందుతున్నారని గుర్తుచేశారు.
134 రకాల పరీక్షలు ఉచితంగా..
ప్రభుత్వం జిల్లాలో, పట్టణాల్లో, నగరాల్లో ప్రతి సెంటర్ ద్వారా 134 టెస్టులను ఉచితంగా చేయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. పరీక్షలు చేయడమే కాకుండా టెస్ట్ల రిపోర్టులను పేషెంట్ ఫోన్కు, డాక్టర్ ఫోన్కు నేరుగా పంపిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 3002 పల్లె దవాఖానలు, 434 బస్తీ దవాఖానలు, మండలానికో పీహెచ్సీ, నియోజకవర్గానికో వంద పడకలు, జిల్లాకో మెడికల్ కాలేజీ, పదివేల సూపర్ స్పెషాలిటీ పడకలతో దవాఖానలు నిర్మిస్తున్నామని వివరించారు. అనంతరం బిల్లును మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది.
ప్రాథమిక వైద్యం అందించే కేంద్రంగా పీహెచ్సీలు
కొత్త మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని విపక్షాలు కోరినట్టు మంత్రి హరీశ్రావు చెప్పారు. పీహెచ్సీ ప్రాథమిక వైద్యం అందించే కేంద్రంగా ఉంటుందని, పీహెచ్సీ సెంట్రిగ్గా ప్రతి గ్రామంలో సబ్ సెంటర్ పల్లె దవాఖాన ద్వారా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి వెల్లడించారు. ఏఎన్ఎం సబ్సెంటర్ను పల్లె దవాఖానగా అప్డేట్ చేసి ఒక డాక్టర్, నర్స్తో వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.