సిద్దిపేట : సిద్దిపేట అంతా తన కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీయువకులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి.. ఉద్యోగాలు సాధించేలా తరగతులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. టీఎస్ టెట్ ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. టెట్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్లో 32 శాతం ఉత్తీర్ణత సాధిస్తే.. కేవలం సిద్దిపేటలోని కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ నుంచి 82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. 618 మంది అభ్యర్థులకు గానూ 517 మంది పాసయ్యారని మంత్రి స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్టర్మ్ కోచింగ్ ఇప్పిస్తామని చెప్పారు.
త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతుందన్నారు. దానికి కూడా ఉచితంగా కోచింగ్ ఇస్తామని వెల్లడించారు. అభ్యర్థులందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే ఈ కేసీఆర్ కోచింగ్ సెంటర్కు నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని హరీశ్రావు పేర్కొన్నారు. 317 జీవో రద్దు చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సిగ్గుచేటని మంత్రి అన్నారు.