వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తోంటే ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. వనపర్తిలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్యకేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, వైద్యఆరోగ్య మౌళిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కమిషనర్ వాకాటి కరుణ , గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ , డీఎమ్ఈ రమేష్ రెడ్డి, కలెక్టర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. రహదారుల విస్తరణ ఎంతో ఇబ్బందితో కూడుకున్నది అని తెలిపారు. సిద్దిపేటలో ఒక్క సుభాష్ రోడ్ విస్తరణకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు .. దానికి ఏడాదిన్నర సమయం పట్టింది అని గుర్తు చేశారు. వనపర్తిలో ఆరు రహదారులు నాలుగు లేన్లుగా విస్తరణ అంటే ఎంత కష్టపడాలో తనకు తెలుసన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి కృషి అభినందనీయం అని కొనియాడారు. కేసీఆర్ ఆశీస్సులు, తన సహకారం సంపూర్ణంగా ఉంటుందన్నారు.
కేసీఆర్ కిట్ రాకతో ప్రభుత్వ ఆసుపత్రులలో 54 శాతం కాన్పులు పెరిగాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలో తెలంగాణ ఉత్తమ సేవలు అందిస్తున్న రాష్ట్రంగా కేంద్రం గుర్తించింది. రాష్ట్రంలో రూ.407 కోట్లతో 23 ప్రసూతి ఆసుపత్రులు, రూ. 30 కోట్లతో ప్రసూతి గదుల నిర్మాణం జరుగుతుందన్నారు. పుట్టిన పిల్లల కోసం ఎస్ఎన్ సీయూ కేంద్రాలను ఏడేళ్లలో 65కి పెంచామని తెలిపారు. శిశుమరణాలను 25 శాతం నుండి 16 శాతానికి తగ్గించాం.. జాతీయ సగటు 22 శాతంగా ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, ప్రణాళికతో ప్రజలకు వైద్యారోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చామని హరీశ్రావు పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ.1500 కోట్లతో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామని మంత్రి హరీశ్రావు తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూలులలో వచ్చే విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు , గద్వాలలో ఒక్కొక్కటి రూ.50 కోట్లతో నర్సింగ్ కళాశాలల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
15 – 17 ఏండ్ల పిల్లలకు 90 శాతం మందికి వాక్సిన్ వేసి వనపర్తి జిల్లా అగ్రభాగంలో నిలిచింది అని మంత్రి తెలిపారు. జ్వర సర్వేకు సహకరించాలి .. కోటి 27 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు రాష్ట్రంలో పంపిణీ చేశాం .. 2 కోట్ల కరోనా పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు.