సిద్దిపేట : స్వచ్చ సర్వేక్షణ్ 2021లో జాతీయ స్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్ధిపేట మున్సిపాలిటీ మరో ముందడుగు వేసింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రుతు ప్రేమ’ అనే కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మహిళకు రుతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, చిన్న పిల్లలకు బట్ట డైపర్లను ఉచితంగా పంపిణీ చేసే ఓ సరికొత్త ఆలోచనకు హరీశ్రావు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేటలోని ఐదో వార్డులో హరీశ్రావు బుధవారం ప్రారంభించి, మహిళలకు రుతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, పిల్లలకు డైపర్లు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. బట్ట ప్యాడ్స్ వాడటంలో ప్రపంచానికే సిద్దిపేట ఆదర్శంగా నిలవాలన్నారు. రుతుస్రావం గురించి మాట్లాడానికి జుగుప్సాకరంగా ఉంటుంది. అయినప్పటికీ దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నెల జరిగే రుతుస్రావ ప్రక్రియలో బట్ట ప్యాడ్లు, రుతుస్రావ కప్పులు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. డబ్బు వృధా కాదని మంత్రి స్పష్టం చేశారు.
ఐదో వార్డు ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడంలో ఆదర్శంగా నిలిచారని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రుతు ప్రేమ కార్యక్రమానికి ఈ వార్డును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులకు త్వరలోనే అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, బట్ట ప్యాడ్స్ పంపిణీ చేస్తామని హరీశ్రావు పేర్కొన్నారు.