వాషింగ్టన్: ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా డెల్టా వేరియంట్తో అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు ఆ దేశ అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ. కరోనాను అమెరికా నుంచి పూర్తిగా పారదోలాలని అనుకుంటున్న తమకు ఇది సవాలేనని అన్నారు. ఈ డెల్టా వేరియంట్ వల్ల నిస్సందేహంగా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నదని స్పష్టం చేశారు. పైగా వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఇస్తున్న అన్ని వ్యాక్సిన్లు ఈ వేరియంట్ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఫౌచీ వెల్లడించారు.
దీనికి ఎదుర్కొనేందుకు మా దగ్గర సాధనాలు ఉన్నాయి. వాటితో దీని వ్యాప్తిని అరికడతామని అన్నారు. మరోవైపు జులై 4 కల్లా దేశంలోని వయోజనుల్లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అమెరికా అందుకునేలా కనిపించడం లేదు. దీనికి మరికొన్ని వారాల సమయం పట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ అమెరికాలో 45 శాతం మంది అంటే 15 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.