హైదరాబాద్ : నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ ప్రాంగణంలో రూ. 2.4 కోట్ల విలువ చేసే 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులు, రూ. 10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్, స్థానిక కార్పొరేర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెవరేజేస్, మిల్క్, చిరు ధాన్యాల ఉత్పత్తులు, నూనెలు, మసాల దినుసులు, స్వీట్స్, రెడీ మేడ్ ఫుడ్, ఇతర విభాగాల ల్యాబ్లను మంత్రి పరిశీలించారు. పరీక్షల విధానం, కల్తీ జరిగే తీరు పట్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం మన చేతుల్లో ఉందనీ ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు తెలిపారు. కల్తీకి పాల్పడే వారి పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తా అన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని మంత్రి అన్నారు. కల్తీకి పాల్పడిన వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. అధికారులు నెలవారీ రిపోర్టులు సిద్దం చేసి పంపించాలని సమీక్షలో మంత్రి ఆదేశించారు.
సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచామన్నారు. రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడంతో పాటు, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జీహెచ్ఎంసీలో ఇప్పుడున్న బస్సుకు అదనంగా ఒకటి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో బస్సును అందుబాటులో ఉంటాయన్నారు. ఆయా జిల్లాల పరిధిలో తిరుగుతూ, ఆహార కల్తీ గుర్తించడం జరుగుతుందనీ, బస్సుల ద్వారా ఆహార కల్తీ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సర్ప్రైజ్ విజిట్స్ చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఫిర్యాదులు రాగానే వీరు వెళ్లి సరైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నదనీ, ప్రజలు సైతం ఎక్కడైనా కల్తీ జరిగినట్లు సమాచారం ఉంటే.. 040 – 21111111 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని మంత్రి హరీశ్రావు చెప్పారు.