జగిత్యాల : రాష్ట్రంలో సిజేరియన్లు తగ్గి, సాధారణ ప్రసవాలు పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిజేరియన్లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢనమ్మకం పోవాలన్నారు. ఆరోగ్య రంగాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
జగిత్యాల పట్టణంలో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, రవి శంకర్, విద్యా సాగర్ రావు, టీఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఇ రమేష్ రెడ్డి, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కంటే ముందు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో నిర్వహించిన జ్వర సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఆశా కార్యకర్తలు బాగా పని చేశారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు సార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. 2014 లో రూ.1500 ఉంటే ఇప్పుడు రూ. 9750 ఇస్తున్నాం. ఆశా కార్యకర్తల జీతం గుజరాత్లో రూ. 4000, రాజస్థాన్లో రూ. 3000, మధ్య ప్రదేశ్లో రూ. 3000 మాత్రమే అని మంత్రి తెలిపారు.
జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 44 శాతమే వుంది. కేసీఆర్ కిట్లు, వైద్య సదుపాయాలు వచ్చాకా ఎందుకు 66 శాతం మంది ప్రైవేటు వెళ్తున్నారు. నాకు సమాధానం కావాలని హరీశ్రావు ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ వైద్య వ్యవస్థను బలోపేతం చేశాక, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే ఇప్పుడు 56 శాతానికి పెరిగిందన్నారు. 108, 102 అమ్మ ఒడి వాహనాలు ఉన్నాయి. ఆడబిడ్డ పుడితే రూ.13,000 ఇస్తున్నాం, కేసీఆర్ కిట్స్ ఇస్తున్నాం. అయినా ప్రైవేటు ఎందుకు పోతున్నారని మంత్రి ప్రశ్నించారు.
జగిత్యాలలో 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. సిజేరియన్ల వల్ల తల్లీబిడ్డలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని హరీశ్రావు తెలిపారు. సీజేరియన్లు తగ్గించడంలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు కీలకపాత్ర పోషించాలన్నారు. దేవుడు ఇచ్చిన వరం సాధారణ ప్రసవం. అనవసరంగా సిజేరియన్లు వద్దని హరీశ్రావు సూచించారు. తల్లి పాలు అమృతంతో సమానం. సిజేరియన్ వల్ల మొదటి గంటలో ముర్రు పాలు అందటం లేదు. రాష్ట్రంలో పుట్టిన మొదటి గంటలో 36 శాతమే మూర్రు పాలు తాగుతున్నారని తెలిపారు.
సాధారణ ప్రసవాలు చేసే ప్రభుత్వ వైద్య బృందానికి రూ. 3 వేల ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నామని హరీశ్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అమలు చేస్తామన్నారు. ఇదే సమయంలో సిజేరియన్లు చేసే వైద్య బృందానికి ఇన్సెంటివ్ తొలగిస్తామన్నారు.