సిద్దిపేట : యేసు ప్రభువు సర్వ మానవ, సమానత్వం కోరారని, అదే విధంగా సీఎం కేసీఆర్ సర్వ మతాలను గౌరవిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో రూ.1.50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్రిస్టియన్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు.
నియోజకవర్గ పరిధిలోని 3,600 మంది పేద క్రైస్తవలకు దుస్తులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం స్థలం ఇచ్చి ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోనే తొలి క్రైస్తవ భవనం నిర్మించుకుని ప్రారంభం చేసుకున్నామన్నారు. ప్రతి యేటా క్రిస్మస్ పండుగను అధికారికంగా జరుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
సాయం అందించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి చేయూత అందించాలని కోరారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా క్రైస్తవులకు కమ్యూనిటీ భవనాలు జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేటలో నిర్మించుకున్నామని, త్వరలోనే అన్ని నియోజకవర్గ పరిధిల్లో కూడా వస్తాయని మంత్రి పేర్కొన్నారు.
అలాగే క్రైస్తవ సమాధుల కోసం 5 ఎకరాల్లో స్థలాన్ని కేటాయిస్తామని, త్వరలోనే గజ్వేల్ లో హిందువులకు వైకుంఠ రథం తరహాలో క్రైస్తవులకు పరలోక యాత్ర వాహనాన్ని అందించే ఏర్పాటు చేస్తామని భరోసానిచ్చారు.