సిద్దిపేట : స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై రాష్ట్ర మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండాలతో వజ్రోత్సవ వేడుకలు చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్రావు నిప్పులు చెరిగారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ఇది సిగ్గుచేటు విషయమన్నారు. ఇదేనా వజ్రోత్సవాలు జరిపే తీరు, ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ అంటూ కిషన్ రెడ్డిని హరీశ్రావు కడిగి పారేశారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సిద్దిపేట శివారు రంగనాయక సాగర్లో ఫ్రీడం పార్కును మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మేకిన్ తెలంగాణ పేరిట జాతీయ జెండాలను తయారు చేసి ఇంటింటికీ ఇస్తున్నట్లు తెలిపారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి 20 లక్షల జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గాంధీజీని అవమాన పరుస్తూ.. గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టాలని, అలాంటి సంస్థల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు దేశభక్తిని పెంపొందించేలా, దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను సినిమా టాకీసుల్లో ప్రదర్శించాలన్నారు.