లండన్: వయసు మీద పడుతున్నా తన ఆటలో ఇంకా పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ తనకు అచ్చొచ్చిన వింబుల్డన్లో సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరోసారి సత్తాచాటాడు. కెరీర్ 25వ గ్రాండ్స్లామ్ వేటలో ఉన్న అతడు.. మంగళవారం ఇక్కడ 5 గంటల 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో 7-6 (12/10), 3-6, 6-3, 6-7 (4/7), 7-6 (10/4)తో కెనడా ఆటగాడు ఫెలిక్స్ అలియాసిమ్ను ఓడించి ఈ టోర్నీలో రికార్డు స్థాయిలో 15వ సారి సెమీస్కు చేరాడు. వింబుల్డన్ చరిత్రలో ఇదే సుదీర్ఘమైన క్వార్టర్ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. మూడు టైబ్రేక్లకు దారితీసిన రసవత్తర పోరులో విజయం కోసం 25 ఏండ్ల కుర్రాడితో 39 ఏండ్ల జొకో ఎక్కడా తగ్గకుండా పోరాడాడు. నీకో సెట్, నాకో సెట్ అన్నట్టుగా సాగిన పోరులో సుదీర్ఘమైన ర్యాలీలు, బలమైన ఫోర్హ్యాండ్ షాట్లు, కోర్టులో పాదరసంలా కదులుతూ జొకో, ఫెలిక్స్ చేసిన విన్యాసాలు అభిమానులకు ‘పైసా వసూల్’ మజాను అందించాయి. తలా రెండు సెట్లు నెగ్గాక విజేతను నిర్ణయించే ఫైనల్ సెట్ సైతం టైబ్రేక్కు దారితీయగా ఓటమి అంచుల్లోకి వెళ్తున్నా మూడో సీడ్ ఫెలిక్స్ పోరాటాన్ని ఆపలేదు.
22 షాట్ల ర్యాలీ అనంతరం అతడు చేసిన తప్పిదంతో జొకో విజయం ఖరారైంది. మ్యాచ్ అనంతరం జొకో స్పందిస్తూ.. ‘ఇలాంటి క్షణాల కోసమే నేను ఇంకా టెన్నిస్ ఆడుతున్నాను. నాకంటే 15 ఏండ్లు చిన్నవాడైన కుర్రాడితో సమానంగా నేను పోరాడగలుగుతున్నాను. నా కెరీర్లో ఆడిన అత్యుత్తమ మ్యాచ్లలో ఇదొకటి’ అని చెప్పడం గమనార్హం. సెమీస్లో జొకో.. వచ్చే ఆదివారం టాప్సీడ్ సినర్తో తాడోపేడో తేల్చుకోనున్నాడు. రెండో సీడ్ అలగ్జాండెర్ జ్వెరెవ్ (జర్మనీ) 6-4, 6-4, 6-2తో ఆరో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించి ఈ టోర్నీలో తొలిసారి సెమీస్కు అర్హత సాధించాడు. మరో మ్యాచ్లో తొమ్మిదో సీడ్ ఫ్లావియొ కొబొలి (ఇటలీ) 4-6, 6-7 (4/7), 0-6తో అన్సీడెడ్ ఆర్థర్ ఫెర్రీ (యూకే) చేతిలో చిత్తయ్యాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో జాస్మిన్ పౌలిని (ఇటలీ) 3-6, 2-6తో మార్టా కొస్ట్యుక్ (ఉక్రెయిన్) చేతిలో ఓడింది. మరో క్వార్టర్స్లో లిండా నొస్కొవ (చెక్) 6-3, 7-5తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించి కొస్ట్యుక్తో సెమీస్ పోరుకు సిద్ధమైంది.