జహీరాబాద్, నవంబర్ 27: రైతుబంధు పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం రైతుబంధు పంపిణీని నిరాకరించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, జహీరాబాద్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతుబంధు కావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఖతం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ పొలిమేర నుంచి ఆ పార్టీని తరలికొట్టాలని అన్నారు. రైతుల నోటికాడి బుక్కను అడ్డుకుంటారా? అని కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బు వేసేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా, ఆ పార్టీ నేత నిరంజన్ ఫిర్యాదుతో ఎన్నికల కమిషన్ రైతుబంధును నిలిపివేసిందని వెల్లడించారు. రైతుబంధు కావాలా? కాంగ్రెస్ ఖతం కావాలా? అన్నది రైతులు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. ‘రిస్క్ వద్దు.. కారుకే ఓటు గుద్దు’ అని పిలుపునిచ్చారు.
డిసెంబర్ 3 వరకే ఆపగలరు!
డిసెంబర్ 3 వరకే రైతుబంధును కాంగ్రెస్ నేతలు ఆపగలరని, ఆ తర్వాత మళ్లీ ఇచ్చేది సీఎం కేసీఆరేనని హరీశ్ అన్నారు. 11 సార్లు రైతుబంధును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశామని, మూడోసారి అధికారంలోకి వచ్చాక ఎకరానికి రూ.16 వేలు ఇస్తామని వివరించారు. రైతులతో సీఎం కేసీఆర్ది ఓటు బంధం కాదని, పేగుబంధం అని స్పష్టం చేశా రు. 5 గ్యారెంటీలు అని చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అటకెక్కించిందని ఆరోపించారు. అక్కడి ప్రభుత్వం దివాలా తీసిందని తెలిపారు. వారిని నమ్మి ఓటేస్తే తెలంగాణకు కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.
లింగాయత్ల అభివృద్ధికి ఎన్నో పథకాలు
లింగాయత్ సమాజ్ అభివృద్ధి కోసం సీ ఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ట్యాం క్బండ్పై బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేశామని, లింగాయత్ భవనం నిర్మాణానికి స్థలం ఇచ్చి నిధులు మంజూరు చేశామని వివరించారు. జహీరాబాద్లో లింగాయత్ భవనాల నిర్మాణానికి, హుగ్గెల్లి చౌరస్తాల్లో బసవేశ్వర్ విగ్రహం ఏర్పాటుకు నిధులు మంజూ రు చేశామని వెల్లడించారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కూడా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు తన్వీర్కు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇచ్చామని అన్నారు. జహీరాబాద్లో షాదీఖానా, హజ్హౌస్కు నిధులు మంజూ రు చేశామని, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మాణిక్రావును అధిక మోజార్టీతో గెలిపించాలని కోరారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పాలన చేస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 125 ఆడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. సమావేశాల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, టీఎస్డీసీ చైర్మన్ తన్వీర్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్పాటిల్, రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, టెలికం బోర్డు సభ్యులు పవార్ శంకర్నాయక్, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, బీఆర్ఎస్ నాయకులు జీ గుండప్ప, సుభాశ్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, గోటిగార్పల్లి భూమయ్య, జనార్దన్, శంకర్ పాటిల్, నామ రవికిరణ్తో పాటు వివిధ మండల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.