సిద్ధిపేట : సిద్ధిపేట అంటే అన్నింట్లో ఆదర్శమని, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ సిద్ధిపేట పేరు లేని అవార్డు ఉండదని, ఇదే పట్టణం మరోసారి నిరూపించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పట్టణ పగ్రతిలో పారిశుధ్య నిర్వహణలో సిద్ధిపేట పట్టణం మరోసారి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో లక్ష జనాభా కలిగిన 13 మున్సిపాలిటీలో సిద్ధిపేట పట్టణం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
రాష్ట్రంలో 25వేల నుంచి 50వేల జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో గజ్వేల్ మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలువగా.. శుక్రవారం హైదరాబాద్లో మున్సిపల్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సిద్ధిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు, గ్రేడ్ వన్ సిద్ధిపేట మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా సిద్ధిపేట పట్టణంలో ప్రతి ఒక్కరి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు.
ఏ అవార్డు అయినా.. సిద్ధిపేట పేరు లేనిది ఉండదని, మరోసారి ప్రజలు చూపిన స్ఫూర్తి గొప్పదన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులు సాధించాలని, ఈ సందర్భంగా పుర ప్రజలకు, సిద్ధిపేట కౌన్సిల్కు అధికారులకు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, అదేవిధంగా గజ్వేల్ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో అభివృద్ధిలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న పట్టణం గజ్వేల్ అనీ, పట్టణానికి అవార్డు రావడం సంతోషంగా సంతోషంగా ఉందన్నారు.