సిద్దిపేట : మిట్టపల్లి గ్రామం రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిందని, అదే స్ఫూర్తితో రేపు జరగబోయే సిద్ధిపేట అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయిలో ఓట్లతో సత్తా ఏమిటో చూపాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. కుల సంఘ భవనాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని, సద్దితిన్న రేవు తలవాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి కుల సంఘ భవనాలకు మంత్రి చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ మేరకు ముదిరాజ్ సంఘం రూ.40 లక్షలు, యాదవ సంఘం రూ.50 లక్షలు, గౌడ సంఘం రూ.30 లక్షలు, వడ్డెర సంఘం రూ.20 లక్షలు, ఎస్సీ మాదిగ సంఘం రూ.30 లక్షలు, ఎస్సీ మాల సంఘం మిగులు పనులకు రూ.12 లక్షలు నిధులు మంజూరు చేస్తూ.. ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్ధిపేట నియోజకవర్గ అభివృద్ధికి తన కుటుంబంలా భావించి మీ అందరికీ సేవ చేస్తున్నానని తెలిపారు. అభివృద్ధిలో సిద్దిపేటను అన్నింటా ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో సిద్దిపేట ఖ్యాతిని పెంచామని.. ఆ సేవను ప్రజానీకం గుర్తించాలని కోరారు. మిట్టపల్లి గ్రామం నుంచి సిద్దిపేట వరకూ ఫోర్ లేన్ రహదారి వస్తున్నదని, హైటెక్ సిటీగా మారిందని తెలిపారు.